బెజ్జంకి, ఆగస్టు 20: పంట రుణాలు మాఫీ కాలేదని మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద రైతులు ఆందోళన చేశారు. స్థానిక రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పంటల సస్యరక్షణ కోసం చేపట్టే రైతునేస్త కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయశాఖ అధికారి మహేశ్ రాగా, రైతులు పెద్ద ఎత్తున బ్యాంకు స్టేట్మెంట్లతో వచ్చి కార్యక్రమం వద్ద అధికారితో మాకు అర్హత ఉన్న రుణమాఫీ ఎందుకు కాలేదని వాగ్వాదానికి దిగారు.
రూ.2 లక్షల కన్నా తక్కువగా ఉన్న రుణమాఫీ కాలేదని రైతులు గోడువెల్లబోసుకున్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి మహేశ్ రైతులతో మాట్లాడి, ఫిర్యాదులను కార్యాలయంలో అందించాలని, పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. వ్యవసాయశాఖ అధికారులు ఇంటి వద్ద వచ్చి వివరాలు సేకరిస్తారని వివరించారు.
తోటపల్లిలోని ఇండియన్ బ్యాంకు బ్రాంచ్ను రైతులు మూసి తాళం వేసి నిరసన తెలిపారు. బ్యాంకు సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో అధికారుల, సిబ్బందిని బయటకు పంపి తాళం వేసి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న లీడ్బ్యాంకు మేనేజర్ వచ్చి రైతులతో మాట్లాడి 800 మంది రైతుల వివరాలతో కూడిన జాబితా పంపించామని, ప్రత్యేక విచారణలో రైతులకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం స్పందించి రుణమాఫీ చేయకుంటే ఉద్యమం చేస్తామని రైతుల హెచ్చరించారు.