రామాయంపేట, జూన్ 27: భూ తగాదాలతో రైతును హత్య చేసిన ఘటన రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన రైతు రాగుల అశోక్(50) ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే పొలం వద్ద కాపుకాసిన పక్క పొలానికి చెందిన వ్యక్తులు అశోక్పై బండరాళ్లతో, కట్టెలతో దాడులకు దిగి హత్య చేశారు. మృతుడు అశోక్కు నిందితులు చేపూరి రమేశ్ కుటుంబానికి పదేండ్లుగా గెట్టు పంచాయితీ నడుస్తున్నది. భూమి విషయంలో గ్రామ పెద్దలు ఇరువురినీ సముదాయించినా సమస్య పరిష్కారం కాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులు విచారణ చేపట్టడంతో నిందితులు రామాయంపేట పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అశోక్ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆవేశం పట్టలేని గ్రామస్తులు నిందితుడి ఇంటిపై దాడిచేసేందుకు వెళ్లారు. అక్కడికి పోలీసులు ఉండడంతో నిందితుల పశువుల కొట్టం, గడ్డివాములను దగ్ధం చేశారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్తుమార్టన్ నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పాతకక్షలు, భూతగాదాలతోనే అశోక్ను హత్య చేశారని తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి పేర్కొన్నారు.