కొండపాక(కుకునూరుపల్లి), జూన్ 27 : కొండపాక మండలంలోని ఖమ్మంపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిరుపేదలైన లబ్ధిదారులకు అందజేయాలని గజ్వేల్ నియోజవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖత్వపు ఆలోచనలతో, అధికార బలంతో రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని అడ్డుపెట్టుకొని 19 నిరుపేద కుటుంబాలను డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నుంచి గెంటివేసి ఇండ్లకు తాళాలు వేయడం హేయమైన చర్య అన్నారు. గురువారం ఖమ్మంపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రతాప్రెడ్డి సందర్శించడంతోపాటు బాధితుల కుటుంబాలను ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఖమ్మంపల్లిలో నిరుపేదల కోసం 60 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేశారన్నారు. 41 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించగా, మరో 19 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించే క్రమంలో ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ చేయలేదన్నారు. గ్రామంలో ఎలాంటి ఆస్తిపాస్తులు లేని వారు ఆ ఇండ్లలో నివసిస్తున్నారని, దయనీయ పరిస్థితిలో ఉన్న వారందరికీ సిద్దిపేట కలెక్టర్, ఆర్డీవో మానవతా దృక్పథంతో ఆలోచించి ఇండ్లు కేటాయించాలన్నారు. లబ్ధిదారులకు అన్ని విధాలుగా బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారికి పట్టాలు అందించే వరకు పోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నూనె కుమార్యాదవ్, రైతుబంధు మండల మాజీ కోఆర్డినేటర్ దుర్గయ్య, నాయకులు జిర్ర రాజు, అహ్మద్, సాయిలు, కోడెల మల్లేశం, కనకయ్య, దోమల శ్రీశైలం, అందె యాదగిరి ఉన్నారు.