వెల్దుర్తి,జూన్ 28 : భూసమస్యల పరిష్కారానికి రైతులు పెట్టుకున్న ధరణి దరఖాస్తులను త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం వెల్దుర్తి తహసీల్ కార్యాలయం, ప్రభుత్వ దవాఖాన, ప్రభుత్వ పశు వైద్యశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. తహసీల్ కార్యాలయంలో ధరణి దరఖాస్తుల వివరాలు తెలుసుకున్న కలెక్టర్, పరిష్కారం చేస్తున్న తీరును తహసీల్దార్ తులసీరామ్ను అడిగి తెలుసుకున్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, వారం రోజుల్లో దరఖాస్తులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. మండలంలో వంద ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్, సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానకు వెళ్లిన రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. డాక్టర్ సౌజన్య, సిబ్బందితో మాట్లాడారు. గదులను పరిశీలించి, మందులను, స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వెటర్నరీ దవాఖానకు వెళ్లిన కలెక్టర్ డాక్టర్ రేఖను అందిస్తున్న వైద్యసేవలు, అందుబాటులో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో మందులను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆర్ఐ జయభరత్రెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో విఘ్నేశ్వర్, ఈవో బలరాంరెడ్డి తదితరులు ఉన్నారు.