Kollur KCR Nagar | రామచంద్రాపురం, జూన్ 20: కండ్ల ముందు పేదోడి కలల సౌధాలు ఆవిష్కృతం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంతిటి కలను నెరవేర్చేందుకు నిర్మించిన ఆదర్శ టౌన్షిప్ మరో చరిత్రను సృష్టించింది. సుమారుగా లక్ష జనాభా ఆవాసం ఉండే విధంగా ఒకేచోట ఏకంగా 15,660 ఇండ్ల నిర్మాణం చేపట్టింది. పేదల కోసం ఎంతో చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలతో కొల్లూర్ ఆదర్శ టౌన్షిప్ని నిర్మించింది. క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా కార్పొరేట్ హంగులతో పేదల కోసం కలల సౌధాల నిర్మాణం చేపట్టింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామంలో పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఆదర్శ టౌన్షిప్ను గురువారం ఉదయం 11గంటలకు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కొల్లూర్ గ్రామంలో 145 ఎకరాల విస్తీర్ణంలో రూ.1432.5కోట్ల వ్యయంతో పేదల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది.
ఈ ప్రాజెక్ట్లో మొత్తం 117 బ్లాక్లు, అందులో జీ+9లో 38, జీ+10లో 24, జీ+11లో 55బ్లాక్లుగా నిర్మాణాలు చేపట్టారు. ఒక్కో డబుల్ బెడ్రూం విస్తీర్ణం 580 ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది. ప్రతి బ్లాక్కు 2 లిఫ్ట్ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్లు, జనరేటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లోర్లో ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేశారు. 36 మీటర్లు, 30మీటర్ల ఔటర్ రోడ్లు, 8 మీటర్లు, 6 మీటర్ల ఇన్నర్ రోడ్లను వేశారు. 12అండర్ గ్రౌండ్ వాటర్ సంప్లను నిర్మించారు. ఒక్కో సంపు 11 లక్షల లీటర్ల సామర్థ్యం ఉంటుంది. 90లక్షల లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి ప్లాంటుని ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టారు. అండర్ గ్రౌండ్ ద్వారా కరెంట్ కేబుల్ని ఏర్పాటు చేశారు. మురికినీటి బాక్సులపై 10.55 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం పనులు వందశాతం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. పేదవారికి సకల సౌకర్యాలతో కూడిన సరికొత్త నివాస ప్రాంతంగా ‘కొల్లూర్ ఆదర్శ టౌన్షిప్’ నిలువబోతున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ధృడసంకల్పం, ఉన్నతస్థాయి అధికారులు, మంత్రుల పర్యవేక్షణ, డీఈసీ ఇన్ఫ్రాస్టక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ ప్రతినిధుల చిత్తశుద్ధి ఫలితంగానే కొల్టూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్లో మూడు షిప్ట్లకు గానూ 6వేల మంది కార్మికులు పనిచేయగా..500మంది స్టాఫ్ ఉద్యోగులు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఈ ప్రాజెక్ట్ను పలుమార్లు సందర్శించి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. అధికారులు, ప్రాజెక్ట్ ప్రతినిధులతో పదేపదే సమీక్షలు నిర్వహించి పనుల్లో వేగం పెంచారు.
కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకే చోట 15,660 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టింది. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పేదల కోసం నిర్మించిన ఇంత పెద్ద ప్రాజెక్ట్ లేదు. కొల్లూర్లో 145ఎకరాల విస్తీర్ణంలో రూ.1432.5కోట్లతో సకల హంగులతో ఆదర్శ టౌన్షిప్ను ప్రభుత్వం నిర్మించింది. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించనున్నారు. – గూడెం మహిపాల్రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే
కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో బస్టాండ్, పోలీస్ ఔట్పోస్టు, ఫైర్ స్టేషన్, మున్సిపల్ బిల్డింగ్, ప్రభుత్వ దవాఖాన, పీహెచ్సీ సెంటర్, గుడి, చర్చి, మూడు షాపింగ్ కాంప్లెక్స్లు, హైస్కూల్, అంగన్వాడీ భవనాలు, ప్రతి సెక్టార్లో పాలకేంద్రాలు, ఫంక్షన్హాళ్లు, శ్మశానవాటిక, ద్విచక్ర వాహనాల పార్కింగ్, బ్యాంక్, ఏటీఎంలు, పోస్టాఫీస్, మార్కెట్, పెట్రోల్ బంక్, కమ్యూనిటీ సెంటర్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు.
కొల్లూర్ ఆదర్శ టౌన్షిప్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన టైం ప్రకారం ప్రాజెక్ట్లో వందశాతం పనులను పూర్తి చేశాం. ఇండ్ల నిర్మాణంతోపాటు రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లైట్లు, తాగునీటి పైప్లైన్లు, సంపులు అన్ని పూర్తి చేశాం. 124 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 117 బ్లాక్లు 15,660 ఇండ్ల నిర్మాణం చేపట్టాం. ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం రూ.1432.5కోట్లు. ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం మరో 20ఎకరాలు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం కొల్లూర్ డబుల్ ఇండ్ల ప్రాజెక్ట్ను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది.
– మధుసూదన్రావు, డీఈసీ ఇన్ఫ్రాస్టక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ సీఈవో