రామాయంపేట, మార్చి 10: విద్యుత్ సరిగ్గా ఇవ్వాలనే సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు అమలు కావడం లేదు. ఇష్టారాజ్యంగా కరెంట్ కోతల మూలంగా పంటలు ఎండిపోతున్నాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో కరెంట్ కోతలు తీవ్రంగా ఉన్నాయి. విద్యుత్ వస్తూపోతూ ఉండడంతో బోరు బావుల వద్ద ఉన్న కరెంట్ మోటర్లు కాలిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామాయంపేట మండలంలోని కోనాపూర్ గిరిజన పెద్ద తండాకు చెందిన రైతు మాలోత్ రమేశ్ ఆయనతో పాటు ఇతర రైతుల పంట పొలాలు ఎండిపోయి నెర్రెలు వారుతున్నాయి.
కరెంట్ కోతల మూలంగా రెండు రోజులకోసారి బోరులో ఉన్న మోటర్ను తీయాలంటే వేల రూపాయల ఖర్చు అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖర్చుల మూలంగా అప్పుల పాలు కావడం తప్పా తమకేమీ మిగలకుండా ఉందని రైతులు వాపోతున్నారు. పంట వేసినప్పటి నుంచి నెలరోజుల్లో నాలుగుసార్లు మోటర్ కాలిపోయిందని రైతు రమేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. పంటను కాపాడుకుందామంటే రాత్రిపూట నాలుగు గంటలు, ఉదయం నుంచి సాయంకాలం వరకు కరెంట్ ఇస్తున్నా లోఓల్టేజీతో పాటు ప్రతి అరగంటకోసారి ట్రిప్ కావడంతో మోటర్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.