చేర్యాల, జూన్ 30 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో శనివారం అర్ధరాత్రి స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులపై అదే గ్రామానికి చెందిన గ్యాంగ్ దాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నగరంలోని సూరారం, బాలాజీనగర్ తదితర ప్రాంతాలకు చెందిన జాగరి కరుణాకర్, కౌలం సాయివెంకట్, జశ్విన్తో పాటు మరో ఆరుగురు స్నేహితులు వాహనంలో కొమురవెల్లికి వచ్చారు. వరల్డ్ కప్ ఫైనల్స్లో ఇండియా విజయం సాధించడంతో మొబైల్ ఫోన్ లో చూసిన హైదరాబాద్కు చెందిన యువకులు కేరింతలు కొడుతూ సంతోషంతో వారు బస చేసే గదుల వైపు వెళ్తుతున్నారు. ఇదే సమయంలో కొమురవెల్లికి చెందిన 8 మంది యువకులు బైక్లపై హైదరాబాద్ భక్తులు వెళ్తున్న మార్గంలో ఎదురెదురయ్యారు.వరల్డ్కప్ గెలిచిన సంబురంలో కేరింతలు కొడుతున్న యువకులను చూసి తమను చూసే కేరింతలు కొడుతున్నారంటూ బైక్లపై వచ్చిన యువకులు ఎలాంటి కారణం లేకుండా విచక్షణారహితంగా రాడ్స్, బైక్లకు ఉండే షాక్ అబ్జర్వర్తో దాడి కి దిగారు.ఈ ఘటనలో కరుణాకర్కు తీవ్ర గాయం కావడంతో పాటు మరో ముగ్గురు యువకులు స్వల్పంగా గాయపడ్డారు.వీరితో పాటు వచ్చిన ఆరుగురు హైదరాబాద్ యువకులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. భక్తులపై దాడికి పాల్పడ్డ ఘటన తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి వెళ్లి వారిని అక్కడ నుంచి పంపించేందుకు యత్నిస్తున్న సమయంలో పోలీసులు చేరుకున్నారు.
దాడి చేసిన గ్యాంగ్కు చెందిన ఓ యువకుడిని పోలీసులు పట్టుకోగా మిగిలిన యువకులు పారిపోయారు. ఘటన ప్రదేశంలో దాడికి పాల్పడిన యువకుల వద్ద గంజాయి ప్యాకెట్లు లభించాయి. యువకులు మ ద్యం, గంజాయి సేవించి మత్తులో మల్లన్న భక్తుల పై దాడికి పాల్పడినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఇదే గ్యాంగ్ సభ్యులు గ్రామంలో జరిగే వారంతపు సంత వద్ద బైఠాయించి వచ్చిపోయే మహిళలు, అమ్మాయిలు, విద్యార్థులను టీజ్ చేస్తున్నారని, మల్లన్న క్షేత్రంలోని ప్రధాన రహదారిలో అతివేగంగా బైక్లు డ్రైవ్ చేస్తున్నారని, కొంచం మెల్లగా పోవాలని అంటే నీకు బైక్ తగిలిందా, తగిలితే చెప్పు చూస్తా అంటూ వారిపై తమ ప్రతాపం చూపిస్తున్నట్లు గ్రామంలో చర్చ జరుగుతున్నది. సంబంధితశాఖ అధికారులు తగు విచారణ జరిపి తమపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గాయపడ్డ యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై చేర్యాల సీఐ శ్రీను విలేకరులతో మాట్లాడుతూ 8 మంది యువకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. యువకుల వద్ద తంబాకు ప్యాకెట్ లభించిందన్నారు.మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా 307 సెక్షన్పైన కేసులు నమోదు చేశామన్నారు. ఇక నుం చి కొమురవెల్లిలో యువకుల సంచారంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.