చేర్యాల, జూలై 1: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం చేర్యాలలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని జనగామ-సిద్దిపేట జాతీయ రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించడంతోపాటు సీఎం రేవంతర్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జాతీయ రహదారిపై గులాబీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించడంతో సిద్దిపేట, జనగామ, నాగపూర్ రహదారుల్లో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రాస్తారోకో చేస్తున్న ప్రదేశానికి వచ్చి బీఆర్ఎస్ నాయకులను బలవంతంగా లాక్కెల్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతోపాటు ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆమరణ దీక్ష చేస్తున్న నిరుద్యోగులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు అన్నివర్గాలనూ మోసం చేసిందన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్లో గెల్చిన ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకుంటూ రాజకీయ వ్యభిచారాన్ని చేస్తున్న సీఎం రేవంత్రెడ్డికి రానున్న రోజుల్లో బుద్ధి చెబుతామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే తన పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో కొమురవెల్లి జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, చేర్యాల పట్టణ, మండల, మద్దూరు, కొమురవెల్లి మండల పార్టీ అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వర్రావు, అనంతుల మల్లేశం, మేక సంతోశ్, గీస భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణీశ్రీధర్రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశం, వైస్ చైర్మన్లు పుర్మ వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలు, నాయకులు ముస్త్యాల బాల్నర్సయ్య, ముస్త్యాల కిషన్, పెడుతల ఎల్లారెడ్డి, శివగారి అంజయ్య, తాడెం రంజితాకృష్ణమూర్తి, పచ్చిమడ్ల మానస, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడురు బాలరాజుతోపాటు నాలుగు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.