గజ్వేల్, జూన్ 26: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణంతో సాగు భూములను కోల్పోయి రోడ్డున పడుతున్నామని, సాగుకు అనుకూలంగా లేని భూముల్లో నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆర్ఆర్ఆర్ భూనిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బాధితులు ర్యాలీ తీశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా ఇందిరాపార్కు చౌరస్తా మీదుగా ఐవోసీ కార్యాలయం వరకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని చేబర్తి, నర్సన్నపేట, ఇటిక్యాల, పీర్లపల్లి, ఇప్పగూడెం, వర్గల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు ఐవోసీ కార్యాలయం ఎదుట ఫ్ల్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ బాధితులు ఇటిక్యాల భాస్కర్, ఎల్లారెడ్డి, చేబర్తి సాయిలు, చేబర్తి బాల్నర్సయ్య మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో సాగు భూములు కోల్పోతుండడంతో రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నదని, అలైన్మెంట్లో మార్పులు చేయాలని ఉగాది పండుగ రోజున రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కలిసి విన్నవించగా మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. కానీ, ఇప్పుడు రెవెన్యూ అధికారులు భూసేకరణ కోసం నోటీసులు పంపుతున్నారని, మంత్రి మాటకే విలువ లేదా అని నిర్వాసితులు ప్రశ్నించారు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమి రోడ్డు నిర్మాణంలో పోతే ఆత్మహత్యలే దిక్కవుతాయని, ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రధాన కాలువలు, పిల్ల కాలువలు, సొరంగాల నిర్మాణం కోసం చాలామంది రైతులు సాగు భూములు కోల్పోయారని, మరోసారి భూములు ఇవ్వాలంటే ఇక తమకు ఆత్మహత్యలు తప్ప మరే మార్గం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలన్నారు. ఆందోళనలో బాధిత రైతులు పాల్గొన్నారు.