గద్వాల, జూలై 2 : బడులు ప్రారంభమైన తరుణంలో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం సమాజంలో చదువుకుంటేనే విలువ, గౌరవం ఉంటుంది. అయితే జిల్లాలో వివిధ పాఠశాలల్లో చ దువుతున్న విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి ప్రభుత్వం సరైన రవాణా సౌకర్యాలు కల్పించక పోవడంతో చాలా మంది విద్యార్థులు చ దువును మధ్యలోనే నిలిపి వేస్తున్నారు. జిల్లాలో ప్రాథమిక విద్యాభ్యా సం పూర్తి చేసిన తర్వాత హైస్కూల్కు వెళ్లాలంటే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. సమీప పాఠశాలలకు వెళ్లాలంటే రెండు నుంచి మూడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొన్నది. మరికొంత మంది విద్యార్థులు వారి గ్రామ సమీపంలో ఉన్న స్టేజీ వరకు కాలినడకన, ఆటోలపై వచ్చి బస్సుల ద్వారా వారు చదివే పాఠశాలలకు వెళ్తున్నారు. గట్టు వంటి మండలంలో సీడ్ పత్తి సీజన్ సమయంలో సుమారు రెండు నెలలు పాటు విద్యార్థులు పాఠశాల కళాశాలకు వెళ్లడం లేదు. సౌకర్యాలు లేక కొంతమంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపి పొలంబాట పడుతున్నారు. ప్రతి ఏడాది అధికారులు బడిబాట చేపట్టి బడికి రాకుండా పనికి వెళ్లే విద్యార్థులను స్కూళ్ల వైపు తీసుకెళ్తున్నా వారు తిరిగి పనులకు వెళ్తున్నారు.
జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా సుమారు 100కుపైగా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు బడులకు వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ పాఠశాలల యజమానులు బస్సులు తిరగని గ్రామాలకు తమ బస్సులను పంపి విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్చుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 461 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 285 ప్రాథమిక పాఠశాలలు ఉండగా అందులో 23,712 మంది విద్యార్థులున్నారు. 81 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 10,702 మంది, 94 ఉన్నత పాఠశాలల్లో 26,562 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఇందులో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఆయా మండలాల్లో పరిధిలోని గ్రామాలకు బస్సులు వెళ్లకపోవడంతో ఆయా గ్రామాల విద్యార్థులు సమీప పాఠశాలలకు కాలినడకన, ఆటోలు, సైకిళ్లపై వ్యయ ప్రయాసాలకోర్చి చదవుకోవడానికి వెళ్తున్నారు.