సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉన్నది. వానకాలం ప్రారంభం కావడంతో పల్లెలు, పురపాలికల్లో పారిశుధ్య సమస్య ఏర్పడింది. వాతావరణంలో మార్పులతో జిల్లాలో సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియాతోపాటు పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది. ఈ తరుణంలో ముందస్తుగా అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలి. కానీ కాంగ్రెస్ హయాంలో ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ అమలు కావడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు చర్యలతో గతంలో చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతితో పరిశుభ్రతకు ప్రాధాన్య తనిచ్చారు. ప్రస్తుతం గ్రామాల్లో ఇండ్ల మధ్య పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లు పెరగడం, మురుగు పేరుకు పోయి పారిశుధ్యం కొరవడింది. వాన నీరు నిల్వతో దోమలు, ఈగల ఉధృతి పెరిగింది. ఫలితంగా ప్రజల్లో సీజనల్ రోగాల భయం నెలకొన్నది.
గ్రామాలు, పురపాలికల్లో సీజనల్ రోగాల ముప్పు పొంచి ఉన్నది. వానకాలం రావడంతో పారిశుధ్యం కొరవడనున్నది. గతేడాదికంటే ముందుగా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ఇండ్ల మధ్యనే పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. అలాగే రోడ్లు, ఖాళీ జాగాల్లో నిలిచిన నీటితో బురదమయంగా మారాయి. ఇక గ్రామ శివారు ప్రాంతాల్లోనూ ఆపరిశుభ్రత నెలకొన్నది. దీంతో దోమలు, చిన్నచిన్న క్రిములు, ఈగలు పెరిగి స్వైర విహారం చేస్తున్నాయి. దోమలు సాయంత్రమైందంటే ప్రజల రక్తాన్ని పీల్చుతున్నాయి. ఇక పంచాయతీ, పురపాలికల అధికారులు ఫాగింగ్ చేపట్టడం లేదనే ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ కారణంగా వానకాలంలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్, విరేచనాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడిప్పుడే వర్షాలు ప్రారంభం కావడంతో ముందస్తుగా చర్యలు తీసుకోకుంటే ప్రజలు అనారోగ్యంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు పారిశుధ్య చర్యలు తీసుకునేందుకు ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. గ్రామాల్లో సర్పంచుల పదవులకు ఎన్నికలు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేక అధికారులు గ్రామాల్లో మంచినీరు, విద్యుత్, పారిశుధ్య పనులు నిర్వహించలేకపోతున్నారు. ఇప్పటి వరకూ ఎన్నికల కోడ్తోనే ఉన్న అధికారులు తాజా గా బదిలీలకు పైరవీలు చేసే పనిలో బిజీబిజీగా ఉన్నట్లు తెలిసింది. ఈ కారణాలతో పారిశుధ్యం ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా తయారైంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న చర్యలతో సీజనల్ వ్యాధులు దూరమయ్యాయి. ప్రతి సంవత్సరం రెండుసార్లు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇండ్ల మధ్య మురుగు గుంతలు లేకుండా మట్టి వేసి చదును చేశారు. బ్లీచింగ్ పౌడర్ చల్లడం, పాత ఇండ్లను కూల్చడం, రోడ్ల వెంట మొలిచిన పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లను జేసీబీలతో తొలగించడం, నీళ్ల ట్యాంకులను, మురుగు కాల్వలను శుభ్రం చేయ డం, క్లోరినేషన్లాంటి చర్యలు చేపట్టారు. దీంతో పారిశుధ్య సమస్య తీరడం, సీజనల్ రోగాలు క్రమేణా తగ్గుతూ వచ్చాయి. కాగా ప్రస్తుతం అలాంటి చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. దీనివల్ల గ్రామా లు, పట్టణాల్లో పారిశుధ్య సమస్య ప్రధానంగా మా రింది. దోమలతో పాటుగా ఈగలు, పందులు, కుక్క ల బెడద ఎక్కువైంది. ఇక పిచ్చిమొక్కలు పెరగడం తో రాత్రిళ్లు ప్రజలకు పాములు, తేళ్ల బెడద నెలకొన్నది. పట్టణ ప్రాంతాల్లోనూ విషసర్పాలు సంచరిస్తూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక ప్రధానంగా నీళ్ల ట్యాంకులు శుభ్రపర్చడం మరిచారు. ఇక వైద్య, ఆరో గ్య శాఖ ద్వారా కేవలం శుక్రవారం మాత్రం డ్రై డే మొక్కుబడిగా నిర్వహిస్తూ అధికారులు మమ అనిపిస్తున్నారు. ఇక గ్రామాల్లో ప్రజలకు సీజనల్ రోగాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం లేదు. గ్రా మాలకు తిరిగి వైద్యఆరోగ్య శాఖ దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. దోమలు వృద్ధిచెందకుండా మందులను అందించాల్సి ఉంది. కేసీఆర్ పాలనలో జిల్లాలోని నల్లమల ప్రాంతంలో పదేళ్లలో చెంచులకు సీజనల్ రోగాల ముప్పు లేకుండా పో యింది. ఇప్పుడు ఎలాంటి కార్యాచరణ కనిపించకపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతున్నది. వానకాలం రావడంతో చెంచులకు దోమ తెరలను పంపిణీ చేయాల్సి ఉన్నది. మొత్తంమీద బీఆర్ఎస్ హయాంలో సీజనల్పై ముందస్తు సమరం చేపట్టగా ఇప్పుడు ఎలాంటి కార్యాచరణ చేపట్టకపోవడంతో ప్రజలకు సీజనల్ రోగాల భయం నెలకొన్నది.
జిల్లాలో పదేళ్లలో డెంగీ కేసులు తప్పా ఎలాంటి సీజనల్ వ్యాధులు ప్రభావం చూపించలేదు. ఫైలేరియా కేసులు 2018లో 122 నమోదు కాగా ఆ తర్వాత ఒక్కరికీ ఈ వ్యాధి సోకలేదు. గతంలో ఆందోళన కలిగించిన స్వైన్ఫ్లూ సింగిల్ అంకెకే పరిమితమైంది. విరేచనాలు 2021లో మాత్రమే 12 కేసులు, 2022లో 18 కేసులు, 2023లో 20 మాత్రమే వెలుగు చూశాయి. టైఫాయిడ్ కేసులు నాలుగేళ్లలో ఐదు మాత్రమే నమోదయ్యాయి. అతిసార కేసులు ఆందోళనకరంగా కనిపించినా వ్యాధి తీవ్రత బాగా తక్కువ. మామూలు లక్షణాలతోనే ప్రజలు కోలుకొన్నారు. నల్లమల అటవీ ప్రాంతాల్లోనూ ఈ వ్యాధులు నమోదు కాకపోతుండటం విశేషం. దోమకాటుతో వచ్చే మలేరియా, డెంగీ, చికున్ గున్యా, ఫైలేరియా, జపనీస్ ఎన్సెఫాలిటీస్(జేఈ) వ్యాధిగ్రస్తులు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. అలాగే కరోనా కంటే ముందు ఆందోళన కలిగించిన హెచ్-1ఎన్-1 వైరస్ సంక్రమిత స్వైన్ఫ్లూ సైతం దూరమైంది. ఇక కలుషిత నీటి సంక్రమిత అతిసార, విరేచనాలు, టైఫాయిడ్ వంటి వ్యాధులు భారీగా తగ్గుముఖం పట్టాయి. నీళ్ల ట్యా ంకుల వద్ద మురుగు తొలగించడం, నీళ్లల్లో బ్లీచింగ్ చల్లడం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం సరఫరా జరగడం దీనికి కారణం. ఇలా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రగతితో సీజనల్ వ్యా ధు లు దూరమయ్యాయని చెప్పొచ్చు. ఫలితంగా పల్లెలు ఆరోగ్యంగా మారాయి. వీటితో పాటుగా పిచ్చిమొక్కలు, పాడుబడ్డ ఇండ్లు, బావులు తొలగించడంతో పాములు, తేళ్లలాంటి విషపురుగుల సంచా రం తగ్గింది. ఈ కారణంగా పాము, కుక్క కాట్లు, పందుల దాడులు అడపాదడపా తప్పా గణనీయంగా తగ్గాయి. ఇలా పల్లె ప్రగతితో గత పదేళ్లలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు దూరమయ్యాయి.
సీజనల్ వ్యాధులపై ప్ర జలు అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులు ప్రబలే శాతం తగ్గుతుంది. పదేళ్లలో సీజనల్ వ్యాధులైన స్వైన్ ఫ్లూ, డెంగీ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ కేసులు తగ్గాయి. ప్రస్తుతం ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నాం. త్వరలో ప్రత్యేకంగా సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వైద్యసిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలి.