నాగర్కర్నూల్, జూన్ 27 : ప్రజా సమస్యలను ఎ ప్పటికప్పుడు పరిష్కరిస్తూ, వారికి గౌరవవంతమై న పాలనను అందించేందుకు అధికారులు జవాబుదారీతనంగా పనిచేయాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. గురువా రం నాగర్కర్నూల్లోని ఐడీవోసీ సమావేశ మందిరంలో కలెక్టర్ బదావత్ సంతోష్ అధ్యక్షతన ఎమ్మెల్సీలు దామోదర్రెడ్డి, గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, నారాయణరెడ్డి, రాజేశ్రెడ్డిలతో కలిసి నీ టిపారుదల, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, మెడికల్ కళాశాల, విద్యుత్, పౌరసరఫరాలు, మిషన్ భగీరథ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ.. ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజాపాలనలో పారదర్శకతే ప్రామాణికమని.. సమస్యల పరిష్కారానికి ప్ర భుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలతో అధికారులు మర్యాద పూర్వకంగా మసలుకోవాలని సూచించా రు. జిల్లా రైతాంగానికి సాగునీరు అందించేందుకు గానూ ప్రాజెక్టులను పూర్తి చేసేలా అధికారులు చర్య లు తీసుకోవాలన్నారు. జిల్లా అభివృద్ధికి నిధులిస్తామని, ఆయా శాఖల అధికారులు పనుల పురోగతిలో వేగం పెంచాలన్నా రు.
ఎంజీకేఎల్ఐని వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా రానున్న ఆరు నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరానికి నీరు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. సాగునీటి కాల్వల్లో జమ్ము, చెత్తను తొలగించేందుకు కావాల్సిన ఎస్టిమేషన్ నివేదికలను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి రూపొందించాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు నష్టాన్ని రికవరీ చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. నాగర్కర్నూల్ జిల్లా రాష్ర్టానికే రోల్ మోడల్గా నిలిచేలా ధరణి సమస్యలను పరిష్కరించాలన్నారు. జిల్లా దవాఖాన అభివృద్ధికి తన నిధుల నుంచి రూ.50లక్షలు విడుదల చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. జిల్లాలోని అన్ని దవాఖానలకు కావాల్సిన మౌలిక సదుపాయాలతోపాటు సిబ్బందికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. మెడికల్ కాలేజీతోపాటు జిల్లా దవాఖానకు మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి మాట్లాడుతూ తన వద్దకు వచ్చే రైతుల్లో ఎక్కువ శాతం ధరణి సమస్యలపైనే వస్తున్నారన్నారు. వారి తో తాసీల్దార్లు దురుసుగా ప్రవర్తించకుండా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఎన్నికలకు ముందు బిజినేపల్లి మండలంలోని మార్కండేయ ఎత్తిపోతల పథకాన్ని గత ప్రభుత్వం ప్రారంభించిందని, ఏడు నెలలు గడిచినా పురోగతి లేకపోవడం ఏంటి? పనులు జరుగుతా యా? జరగవా? అని అధికారులను ప్రశ్నించారు.
రానున్న వారం రోజుల్లో ధరణి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తాసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ధరణి ఫిర్యాదుల పరిష్కారానికి రాత్రి 9 గం టల వరకు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడంతోపాటు ఆకస్మిక తనిఖీలు ఉంటాయని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేఎల్ఐ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఐదు టీఎంసీల నీటి నిల్వ కోసం ఒక రిజర్వాయర్, డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ఏర్పాటు చేయాలని అచ్చంపేట ఎ మ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ప్రభుత్వ భూములను కా పాడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని, సేవ్ గవర్నమెంట్ ల్యాండ్స్ అనే నినాదంతో విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని సూచించారు. ఎన్నో ఏం డ్లుగా సాగుచేస్తున్న నిజమైన వారికే పోడు భూముల సమస్యలను పరిష్కరించాలన్నారు. తన నియోజకవర్గంలో కొత్తగా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కో రారు. కేఎల్ఐ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని, ప్రతిరోజూ రైతులు తనతో వాగ్వాదం చేస్తున్నారని కల్వకుర్తి ఎ మ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు. వారికి త్వరగా పరిహారం అందేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నా రు. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులతో చర్చించి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో ఇటీవల 200కు పైగా విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయని, వెంటనే వాటిని పునరుద్ధరించాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి కో రారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం తో పనిచేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని సూ చించారు. రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స మావేశంలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, చీర్ల శ్రీనివాసులు, జిల్లా అటవీశాఖాధికారి రోహిత్ గోపి డి, అన్నిశాఖల అధికారులు, ఆర్డీవోలు, తాసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి జూపల్లి అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా మహిళా శిశు, దివ్యాంగ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని 30 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.20లక్షల విలువ చేసే పరికరాలను అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్రెడ్డి, నారాయణరెడ్డి, వంశీకృష్ణ, స్త్రీ శిశు సంక్షేమాధికారి రాజేశ్వరి పాల్గొన్నారు.
జిల్లా మెడికల్ కళాశాలకు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి తన సతీమణి సౌభాగ్యమ్మ పేరుపై బస్సును అందజేశారు. ఈమేరకు గురువారం బస్సు ను కలెక్టరేట్లో మంత్రి ప్రారంభించారు. మెడికల్ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం బస్సును అందజేసినట్లు దామోదర్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి పాల్గొన్నారు.