అచ్చంపేట రూరల్, జూన్ 28 : చివరి ఆయకట్టుకూ సాగునీటిని అందిస్తామని అచ్చంపేట, దేవరకొండ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, బాలూనాయక్ పేర్కొన్నారు. శుక్రవారం డిండి ప్రాజెక్టు (గుండ్లపల్లి) వద్ద వారు పూజలు చేసి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఉప్పునుంతల మండలంలోని లత్తీపూర్, గువ్వలోనిపల్లి, పెనిమిళ్ల తదితర గ్రామాలకు నీరు అందుతుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులకు మేలు చేసేందుకు నాడు శ్రీశైలం బ్యాక్ వాటర్ను కేఎల్ఐ ద్వారా తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డికే దక్కుతుందన్నారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రూ.రెండులక్షల రుణమాఫీని ఆగస్టు15లోగా పూర్తి చేస్తామన్నారు. డిండి ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని, ఉపాధి కూలీలతో కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. అంతకుముందు కట్టకింద ఉన్న మైసమ్మకు పూజలు చేశారు. కార్యక్రమంలో ఉప్పునుంతల, అచ్చంపేట జెడ్పీటీసీలు అనంతప్రతాప్రెడ్డి, ముడావత్ మంత్రియానాయ క్, ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకు డు అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.