నాగర్కర్నూల్, జూన్ 28 : అధికారం చేపట్టిన ఏడు నెలల్లోనే కాంగ్రెస్ నాయకులు ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మండిపడ్డారు. విద్యపై రాజకీయాలు చేయొద్దని, చేతనైతే అభివృద్ధిలో తనతో పోటీపడాలని ఆయన హితవు పలికారు. తన నిధులతో నిర్మించిన పాఠశాలపై ట్రస్టు పేరును తుడిచి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రారంభించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డికి నాగర్కర్నూల్లోని వైభవ్ గార్డెన్స్లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్కుమార్రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, నాగం శశిధర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్గౌడ్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. అనంతరం ఇటీవల జరిగిన పరిణామాలపై మర్రి స్పందించారు. ప్రారంభించిన పా ఠశాలనే మళ్లీ ప్రారంభించి విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేస్తున్నారన్నారు. సేవాభావంతో తన ట్రస్టు ద్వారా నాలుగు పాఠశాలలు నిర్మించానన్నారు. మీకు చేతనైతే మరో నాలుగు స్కూళ్లు నిర్మించాలని..
తమ నాయకులతో వచ్చి సన్మానం కూడా చేస్తామని మర్రి అన్నారు. రాజకీయ స్వలాభం కోసం పూర్తయిన పాఠశాలను ఏడు నెలలుగా ప్రారంభించకుండా ఆపింది మీరు కాదా? అని ఆయన ప్రశ్నించా రు. సొంత డబ్బులతో స్కూళ్లు కట్టించిన తనపైనే కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాఠశాలకు తమ పేరు లే కుండా చేశారు కానీ.. ప్రజల గుండెల్లో నుంచి మర్రి జనార్దన్రెడ్డి పేరును చెరపలేరన్నారు. ప్రజలపై అభిమానంతో రూ.5కే భోజనం పెడుతున్నానని.. మీకూ ప్రేమ ఉంటే రూ.1కే భోజనం పెట్టాలని సూచించారు. ఏదో ఉద్ధరిస్తారని ప్రజలు మిమ్మల్ని గెలిపించారని గుర్తు చేశారు. అభివృద్ధిని వదిలేసి తమ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ అరాచకాలకు ఎవరూ అధైర్యపడొద్దని, తమకు మంచిరోజులొస్తాయని ధైర్యం చెప్పారు. ‘2014లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడూరులో కాలేజీ నిర్మాణానికి భూమి ఇచ్చి ఆ కళాశాలకు మీ కుటుంబ సభ్యుల పేరు పెట్టుకున్నారు. అప్పట్లో నేను అనుకుంటే ఆ పేరు ను తొలగించొచ్చు కానీ.. నేనలా చేయలేదు.. నేను నాలుగు స్కూ ల్స్ కడితే మీరు ఎనిమిది కట్టండి.. అప్పుడు ప్రజలే మిమ్మల్ని మెచ్చుకుంటారు కానీ.. నేను కట్టించి ప్రారంభించిన స్కూల్ బోర్డులపై పేర్లు చెరిపి మళ్లీ ప్రారంభించడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని మర్రి అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో శాంతిభద్రతల విషయంలో పోలీసులు చేతులెత్తేశారన్నారు. కాలేజీకి వెళ్లి బెంచీల ఫొటో తీసినందుకు మర్రి జనార్దన్రెడ్డి పీఏ నర్సింహపై పోలీసులు కక్ష గట్టారని, విచారణ పేరుతో స్టేషన్కు పిలిపించి ఇబ్బంది పెట్టారన్నారు. శ్రీధర్రెడ్డి హత్య కేసులో ఎలాంటి పురోగతి లేదని.. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. పెద్దకారుపాములలో దళితులపై నాయినోనిపల్లి మైసమ్మ చైర్మన్ శ్రీనివాసులు, అతడి అనుచరులు దాడి చేసినా మంత్రి జూపల్లి అండతో వారిని అరెస్టు చేయలేదన్నారు.
డీజీపీని కలిశాక ముగ్గురిని మాత్రమే అరెస్టు చేశారన్నారు. ఇలాంటి సమయంలో కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఎదిరించేలేకుంటే బెదిరించేవాడిదే రాజ్యమవుతుందన్నారు. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకి పనిచేయడం వల్లే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్నారు. అనంతరం సన్మాన గ్రహీత, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి మా ట్లాడుతూ తన గెలుపునకు కృషి చేసిన ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మ డి జిల్లా వ్యా ప్తంగా ఎలాంటి అవసరం ఉన్నా తన సహకారం ఉం టుందన్నారు. కార్యకర్తలు నిజాయితీగా పనిచేయాలని సూచించారు. పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడు తూ పార్టీలో ఉన్నవారు మోసం చేయడం వల్ల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందామని తమ అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, సింగిల్విండో చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.