పెబ్బేరు, జూలై 3 : పెబ్బేరు మండలం కొత్తసూగూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు లేకుండానే కొనసాగుతున్నది. స్థానిక దళితవాడలోని ఈ పాఠశాలలో 40 మంది విద్యార్థులుండగా, ఒక్క టీచరే విధులు నిర్వర్తించేవారు. ఆమె కూడా బదిలీ కావడంతో రెండు రోజులుగా విద్యార్థులే పాఠశాలకు వచ్చి పోతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై ఎంఈవో జయరాములును వివరణ కోరగా బదిలీ అయిన టీచరు స్థానంలో నియమితులైన కొత్త టీచరు గురువారం నుంచి విధులకు హాజరవుతారని తెలిపారు. అయితే తమ పాఠశాలకు ఇద్దరు టీచర్లను కేటాయించాలని మాజీ సర్పంచ్ వెంకటేశ్ కోరారు.