నాగర్కర్నూల్ : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ( Palamur Rangareddy Project) పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రతీ ఎకరాకు సాగునీటిని అందిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) వెల్లడించారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఇరిగేషన్ అధికారులతో కలిసి శుక్రవారం కొల్లాపూర్ ప్రాంతంలోని నర్లాపూర్ వద్ద పాలమూరు ప్రాజెక్టు పనులు, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపుల పురోగతిని పరిశీలించారు.
అనంతరం ఇంజినీరింగ్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పథకం ద్వారా ఖరీఫ్ కు ప్రతి ఎకరానికి సాగు నీరు అందించాలని ఆదేశించారు. ప్రాజెక్టులను నిర్మించడం ఎంత ముఖ్యమో ప్రతీ రైతుపొలంలోకి సాగు నీరందించడం అంతే ముఖ్యమని అన్నారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరందించడానికి చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
ప్రాజెక్టు కెనాల్స్ ను పరిశీలించి వారంరోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఫీడర్ కెనాళ్లను పూడ్చి వేసే రైతులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కృష్ణా జలాల (Krishna Water) నుంచి తెలంగాణకు కేటాయించిన పూర్తిస్థాయి నీటి వాటాను ఉపయోగించుకోవాలని సూచించారు. నార్లాపూర్ నుంచి మిషన్ భగీరథ పనులు , పంప్ హౌస్ పనులను పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన గ్రామాల ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు .