వనపర్తి, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : ‘పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను గ్రామ, మండలస్థాయిలో పరిశీలిద్దాం.. తమిళనాడులో 55 ఏండ్లుగా కాంగ్రెస్, బీజేపీల ఊసే లేదు. ఏపీలో జగన్ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే తెలంగాణలో తక్కువ ఓట్లొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో 42 శాతం ఓట్లతో 38 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న బీఆర్ఎస్కు 60లక్షల సభ్యత్వమున్న గులాబీ సైన్యం ఉన్నది. ఇలాంటి పార్టీని ఎవరూ బొందపెట్టలేరు’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో వనపర్తిలో తొలిసారిగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ అధ్యక్షతన శుక్రవారం నియోజకవర్గస్థాయి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రితోపాటు ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఇక ఉండదని, బొంద పెడతామని పదేపదే కాంగ్రెస్ చెబుతున్న మాటలు హాస్యాస్పదమన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడునెలల్లో ఒక్క కొత్త హామీని కూడా అమలు చేయలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలనే కొనసాగిస్తూ, వాటిని కూడా సక్రమంగా అందించడం లేదని విమర్శించారు. కొత్త పథకాలు అమలు కావాలంటే రూ.లక్షా ఇరవై ఐదువేల కోట్లు కావాలని, అంతటి సామర్థ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. ఏపీలో అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడి ప్రభావం తెలంగాణపై పడుతుందన్నారు. తెలంగాణకు నీటిపారుదల రంగంలో తీవ్ర నష్ట ప్రణాళికలు చేసిన ఆదిత్యదాస్ను చంద్రబాబు సూచనతో సీఎం రేవంత్రెడ్డి ఇక్కడ భర్తీ చేశాడన్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే కుట్రలు జరుగుతున్నాయని, తెలంగాణపై కొన్ని అదృశ్య శక్తుల ప్రభావం ఉంటుందన్నారు. ఇది రాష్ర్టానికి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదన్నారు. భవిష్యత్లో తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో తీవ్ర నష్టాలను చవిచూడాల్సి ఉంటుందన్నారు. ఏపీలో పాలన ఎలా ఉన్నా తమకు అభ్యంతరం లేదని, తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడే చర్యలపైనే తమ దృష్టి ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్కు ఎలాంటి భయం లేదని, దేశంలోని 14 రాష్ర్టాల్లో కాం గ్రెస్కు, మరో 11 రాష్ర్టాల్లో బీజేపీకి ఒక్క ఎం పీ స్థానం కూడా రాలేదని నిరంజన్రెడ్డి గుర్తు చేశారు. గ్రామ, మండలస్థాయిలో సమీక్షలు, మేథోమదనం చేసుకుంటామని, మళ్లీ బీఆర్ఎస్సే రావాలని ప్రజలు అనుకునే స్థాయికి పరిస్థితులను తీసుకొస్తామని పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై అధైర్యపడాల్సిన అవసరం లేదని, వాటిపై ఒకసారి ఆత్మ విమర్శ చేసుకుందామని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతిపక్షం బలంగా ఉన్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలలుగా కొత్త పథకాలు అమలుచేయడం లేదన్నారు. కేవలం బీఆర్ఎస్ ఇచ్చిన పథకాలను కొనసాగిస్తూ సర్కారు గారడీ చేస్తున్నదని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎలా తగ్గించాలనే ప్రయత్నాలు చేస్తున్నదని, ప్రజలు తిప్పికొడతారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎలాంటి సహకారమైనా అందించేందుకు సిద్ధంగా ఉంటానన్నారు. తనను గెలిపించిన వారికి, గెలుపు కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ గడిచిన పదేళ్లు పాలనపైనే దృష్టి సారించి ఎన్నో అభివృద్ధి పనులను చేసిందని.. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై నిత్యం చర్చ జరపాలని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమయ్యేలా కార్యక్రమాలు చేపడతామమన్నారు. గ్రామస్థాయి నుంచి మండలస్థాయి వరకు ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక వర్క్షాప్ను నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి నిరంతరం సమీక్షలు కొనసాగిస్తామన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇచ్చిన అబద్ధపు హామీలను ప్రజలు నమ్మి మోసపోయారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎక్కువ ఓట్లు వచ్చిన స్థానాల్లో నాగర్కర్నూల్ రెండోస్థానంలో నిలిచిందని, ఇందుకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఓటమితో ఎలాంటి నిరుత్సాహం లేదని, కుంగడం.. పొంగడం తన జీవతంలోనే లేవని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజాన్ని బతికించుకునేందుకు గతానికి మించి మరింత ఉత్సాహంగా పని చేస్తానని చెప్పారు. ఓటర్లు వారి చేత్తో వారి కండ్లనే పొడుచుకున్నారని పేర్కొన్నారు. అమరుల త్యాగాలు ముఖ్యమా? అక్షింతలు ముఖ్యమా? అని ఆలోచించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదన్నారు. తమిళనాడులో అక్షింతల చర్యకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. రాష్ర్టాన్ని కబ్జా చేసేందుకు అబద్ధపు ప్రచారాలు చేశారని, తెలంగాణ ప్రజలు కూడా త్వరలోనే మేల్కొంటారన్నారు. ప్రస్తుతం అదృశ్య హస్తం ఆధ్వర్యంలో తెలంగాణ పాలన సాగుతున్నదని ప్రవీణ్కుమార్ అన్నారు. భావితరాల భవిష్యత్ కోసం నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటానని, ఎక్కడ సమస్య ఉంటే అక్కడే ప్రత్యక్షమవుతానని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి బైకాని శ్రీనివాస్యాదవ్, నాయకులు అభిలాష్రావు, వాకిటి శ్రీధర్, బి.లక్ష్మ య్య, నందిమళ్ల అశోక్కుమార్, ఉంగ్లం తిరుమల్, నాగన్నయాదవ్, పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.