పాలమూరు, జూలై 1 : మహబూబ్నగర్లోని జిల్లా గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100 కు పెంచాలని, గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో 3వేల పోస్టులను కలిపి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని.. డీఎస్సీ పోస్టులు పెంచి ప్రిపరేషన్కు గడువు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రంథాలయం నుంచి మెట్టుగడ్డ కూడలి వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ నిరుద్యోగులపై కాంగ్రెస్ సర్కారు పక్షపాతం చూపుతున్నదని విమర్శించారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం మాయమాటలు చెప్పి నిండా ముంచిందని నిరుద్యోగులు వాపోయారు. ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. వద్దురా నాయన.. కాంగ్రెస్ పాలన, గ్రూప్-2, గ్రూప్-3, డీఎస్సీ పోస్టులు పెంచి ప్రిపరేషన్కు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. నిరుద్యోగుల తరఫున మోతీలాల్కు మద్దతుగా ర్యాలీ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. మంగళవారం కూడా జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ముమ్మరం చేయాలని కోరారు. కార్యక్రమంలో నిరుద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.