గండీడ్/మహ్మదాబాద్, ఆగస్టు 24 : గండీడ్ పీఏసీసీఎస్ గోల్మాల్ గోవిందం నడుస్తున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘంలో చనిపోయిన రైతుల పేరు మీద రుణాలు తీసుకుని వారి పే ర్లను సంఘం నోటీసు బోర్డుపై వేశారు. దీంతో వారి వారసులు మా కు తెలియకుండా మా నాన్నలు ఎప్పుడు రుణాలు తీసుకున్నారని అ ధికారులను నిలదీశారు. ఆ రుణాలతో మీకేం సంబంధం లేదని, వా టిని మేమే కడుతామని మళ్లీ వారినే దబాయించారు.
దీనిపై గతంలో ‘నమస్తే తెలంగాణ’ కథనాన్ని కూడా ప్రచురించింది. అయినా ఉన్నతాధికారులు వచ్చి చూసింది లేదు.. సిబ్బంది చర్యలు తీసుకున్నదీ లేదు. అయితే మరో సంఘటన బయటకొచ్చింది. రూ. 15 లక్షలు రైతుల పేరు మీద ఉన్న డిపాజిట్లు సైతం కాజేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. సంఘం నుంచి రైతులకు పంట రుణాలు ఇచ్చే సమయంలో ఇచ్చిన మొ త్తంపై 25 శాతం రైతుల పైరు మీద డిపాజిట్ చేయాలి.. డిపాజిట్ చేసి వారికి బాండ్లు అందించాలి.
ఈ విషయాన్ని రైతులకు తెలియజేయాలి. కానీ ఎవరూ వివరించరు. ఇదే అలుసుగా తీసుకొని కొందరు అక్రమాలకు పాల్పడ్డారు. పీఏసీసీఎస్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 225 మంది రైతుల నుంచి డిపాజిట్ల పేరుపై 2010 దాదాపు రూ.15.20 లక్షలు సేకరించారు. 2014 ఏడాదిలో రుణమాఫీ జరిగిన సమయంలో దాదాపు అందరి రుణాలు మాఫీ అయ్యాయి. ఈ సమయంలో తీసుకున్న డిపాజిట్ సొమ్మును తిరిగి రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్నది. కానీ రైతులకు తిరిగి చెల్లించలేదు. సొసైటీ ఖాతాలో డిపాజిట్ చేసినట్లు ఆధారాల్లేవు. ఈ విషయంలో రైతులకు క్లారిటీ లేక మోసపోయారు.
ఎవరైనా విషయం తెలుసుకొని అధికారులను అడిగితే రేపు.. మాపు అంటూ కేవలం పదుల సంఖ్యలోనే ఇచ్చారు. మిగిలింది సిబ్బంది స్వాహా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై సిబ్బందిని అడిగితే సరైన సమాధానం రావడంలేదు. పాలకవర్గం కూడా ఈ విషయాలు తెలియకపోవడంతో రైతులకు న్యాయం చేయలేకపోతున్నది.
కాగా, అధికారుల చేతివాటం కూడా ఉండడంతోనే ఎవరూ పట్టించుకోవడం లేదన్న గుసగుసలున్నాయి. ఇప్పటికైనా అధికారులు విచారణ చేపట్టి తేల్చాల్సి ఉన్నది. గండీడ్ పీఏసీసీఎస్ చైర్మన్ గిరమోని లక్ష్మీనారాయణను వివరణ కోరగా.. రుణాల సమయంలో డిపాజిట్కు సంబంధించిన బాండ్లు రైతుల వద్ద ఉంటే ప్రతి ఒక్కరికీ డబ్బులు ఇప్పిస్తామన్నారు. ఇక్కడ సిబ్బంది చాలా ఏండ్లుగా పనిచేస్తున్నారని, అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే బదిలీ చేస్తామన్నారు. సంఘం లో అవినీతిని అరికట్టి రైతులకు లాభం చేకూరేలా చూస్తామని తెలిపారు.