ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలతో సతమతమయ్యాం.. ఎప్పుడొస్తుందా.. అని వెయ్యి కండ్లతో ఎదురుచూసిన రోజులు నాటివి.. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో వెలుగులు ప్రసరింపజేసింది. గృహ, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరా చేసింది. బోరు, బావులకు విద్యుత్ సమస్యలు లేకపోవడంతో నిరంతరం నీటిని ఎత్తిపోశాయి. పదేండ్ల కాలంలో సాగు సంబురంగా సాగింది.
వ్యాపారులు, చిన్న, భారీ పరిశ్రమలకు సైతం పవర్ఫుల్గా సరఫరా అయ్యింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నాటి వెలుగు జిలుగులు మాయమయ్యాయి. కరెంట్ ‘కట్’కటతో కర్షకులు సతమతమవుతున్నారు. రాత్రిళ్లు పొలాల వద్ద జాగరణ చేస్తున్నారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్
ప్రభుత్వంపై రేవంత్ సర్కారు లేనిపోని అభాండాలు వేస్తున్నది. నాడు రాష్ట్రంలో కరెంట్ కష్టాలను తీర్చిన అధినేతను బదనాం చేసే కుట్ర జరుగుతున్నది. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– మహబూబ్నగర్, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయానికి 24గంటలు కరెంట్ ఇచ్చేటోళ్లు. దీంతో బోరు బావుల కింద పంటలు సమృద్ధిగా పండించేవాళ్లం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక కరెంట్ కోసం కష్టాలు తప్పడం లేదు. పది రోజుల కిందట వర్షం పడితే పత్తి విత్తనాలు నాటుకున్నాం. మొలకలు రాకపోవడంతో బోరు బావుల ద్వారా స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకొని విత్తనాలను బతికించుకుందామని ప్రయత్నిస్తుంటే కరెంట్ సక్రమంగా ఉండడం లేదు. కరెంట్ వచ్చిన వెంటనే రైతులందరూ మోటర్లు ఆన్ చేయడంలో చాలా వరకు మోటర్లు కాలిపోతున్నాయి. పదేండ్లలో మోటర్లు కాలిపోయిన ఘటనలు లేకుండా కాంగ్రెస్ రావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.
రాజోళి మండల కేంద్రంలో నిత్యం కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ అంతరాయం అంటూ నిత్యం కోతలు పెడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా కోతలపై స్పందించడం లేదు. పునరావాస కేంద్రాలు, దళిత కాలనీల్లో కరెంట్ లైన్ లేక చిమ్మచీకట్లో మగ్గుతున్నారు. విషపురుగుల సంచారంతో నిత్యం వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే విద్యు త్ లైన్ ఏర్పాటు చేయాలి.
– విజయ్కుమార్, కేవీపీఎస్ రాజోళి మండలాధ్యక్షుడు
కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కష్టాలు మరింత పెరిగాయి. పొలాల్లో విద్యుత్ తీగలు వేలాడుతున్నా పట్టించుకునే నాయకుడు, అధికారులు లేరు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు 24గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చారు. కానీ రేవంత్రెడ్డి హయాంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియని అయోమయం నెలకొంది. రోజుకు 9గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు. రేవంత్రెడ్డి రైతులపై కక్ష పెంచుకొని కరెంట్ ఇవ్వకుండా, రైతుబంధు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.
– గౌని శ్రీనివాసులు, రైతు, ఎంనోనిపల్లి, ధన్వాడ మండలం, నారాయణ పేట జిల్లా
సీఎంగా కేసీఆర్ కొనసాగిన పదేండ్లలో కరెంట్ కోతలను ఎప్పుడూ చూడలేదు. అసలు కోతల గురించే మరిచిపోయినం. అంతకు ముందు పగలు రాత్రి తేడా లేకుండా గంటలకొద్దీ కోతలు ఉండేవి. అప్పట్లో కరెంట్ సరఫరాలకు వేళలు కూడా ఉండేవి. కానీ, కేసీఆర్ మాత్రం 24గంటల కరెంట్ ఇచ్చి తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు చేశారు. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇష్టమొచ్చినట్లు కోతలు విధిస్తోంది. ఈ వర్షాకాలంలోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా ఉక్కపోతలను భరించలేకపోతున్నాము. ఈ పరిస్థితుల్లో కరెంట్ కోతలు విధిస్తుంటే బాధలు చెప్పలేక పోతున్నాము. ఇంట్లో ఫ్యాన్లు తిరగక పిల్లలు అల్లాడిపోతున్నారు. ఇక రాత్రి పూట అయితే చినుకు పడిందంటే చాలు వెంటనే కరెంట్ పోతుంది. చీకట్లో జాగారం చేయాల్సి వస్తున్నది.
– సంద సరస్వతి, శాఖాపురం, పెబ్బేరు మండలం