మహబూబ్నగర్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పచ్చదనంపై ప్రభుత్వం శీతకన్ను పడింది. వానకా లం ప్రారంభం కాగానే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో యజ్ఞంలా హరితహారం జరిగేది. కానీ ప్రస్తుత ప్రభుత్వ హ యాంలో నీలినీడలు కమ్ముకున్నాయి. జూన్ దాటుతున్నా ఇంకా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఈ సమయంలో మొక్కలు నాటితే పెరిగేందుకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్ సర్కారు ఈ కార్యక్రమంపై ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో 1720 నర్సరీల్లో 1.23 కోట్ల మొక్కలు ఏపుగా పెరిగి వృథాగా ఉండిపోయే పరిస్థితి దాపురించింది. మమ్మల్ని నాటండి.. అంటున్న మొక్కల వేదన కనిపిస్తుంది.
‘నమస్తే తెలంగాణ’ బృందం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నర్సరీల పరిస్థితిపై ఫోకస్ పెట్టింది. కేసీఆర్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మొక్కలు నాటి శ్రీకారం చుట్టేవారు. అంతేకాకుండా గ్రీన్ చాలెంజ్ పేరుతో సెలబ్రిటీలను సైతం ఇందులో భాగస్వామ్యం చేసేవారు. కాగా, కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాత్రం పచ్చదనంపై ఇంకా విధివిధానాలు రూపొందించలేదు. దీంతో వర్షాకాలం ప్రారంభమైన కోట్లాది మొక్కలు నర్సరీల్లోనే మగ్గిపోతున్నాయి.
నర్సరీల్లో కోట్లాది మొక్కలు..
కేసీఆర్ ప్రభుత్వం ప్రతి పల్లె పచ్చదనంతో నిండిపోవాలనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామస్థాయిలో నర్సరీలను ఏ ర్పాటు చేసింది. మండల, మున్సిపల్ స్థాయిలోనూ అటవీశా ఖ ఆధ్వర్యంలో అవెన్యూ ప్లాంటేషన్ కోసం ప్రత్యేక మొక్కలను పెంచుతున్నారు. మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లో రహదారుల వెంట విభిన్నమైన మొక్కలను నాటి పట్టణాలను అందంగా తీర్చిదిద్దారు. ఏటా జూన్ ప్రారంభం కాగానే హరితహారం నిర్వహించేవారు. అయితే కాంగ్రెస్ సర్కార్ మొక్కల పెంపకంపై నిర్ధిష్టమైన ప్ర ణాళికలు రూపొందించకపోవడంతో అధికారులు సైతం సైలెంట్గా ఉ న్నారు. ఆరునెలలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం.. తమకు అనుకూలంగా లేని అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేసే పనుల్లో సర్కారు బిజీ అయింది. దీంతో మొక్కల పెంపకం, నాటడాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలోని 469 నర్సరీల్లో 32 లక్షల మొక్కలను పెంచేందుకు రూ.కోట్లు ఖర్చు చేశా రు. వనపర్తి జిల్లాలో 255 నర్సరీలుండగా.. 18 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నా యి. జూన్ ప్రారంభం నాటికి నాటేందుకు ఈ మొక్కలను పెంచారు. అయితే స ర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మొక్కలన్నీ నర్సరీల్లోనే ఉన్నాయి.
వర్షాకాలం ప్రారంభమైనా..
వర్షాకాలం ప్రారంభమైనా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించకపోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నర్సరీల్లో మొక్కలు వృథాగా పడి ఉన్నాయి. వానలు కురుస్తుండడంతో నర్సరీలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. గతంలో కేసీఆర్ సర్కారు పల్లె, పట్నం, అడవి ప్రాంతాల్లో నాటడంతోపాటు ఇంటికో మొక్కను అందించేది. దీంతో మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లా కేంద్రాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఈసారి హరితహారాన్ని పట్టించుకోకపోవడంతో మొక్కలను నర్సరీల్లోనే సమాధి చేసే పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా సర్కార్ హరితహారం చేపట్టాలని డిమాండ్లు వస్తున్నాయి.