వనపర్తి, జూన్ 25 : జిల్లాలోని రైస్ మిల్లర్లు ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన సీఎంఆర్ ధాన్యాన్ని త్వరగా అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం వనపర్తి శివారులోని రాఘవేంద్ర ఇండస్ట్రీస్, చిట్యాల గోడౌన్, పెద్దమందడి మండలంలోని వీరాయిపల్లిలోని మల్లికార్జున ఇండస్ట్రీస్ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిట్యాల గోడౌన్లో ఎస్పీఆర్ స్టాక్స్ తనిఖీ చేసి ధాన్యం నిల్వలను పరిశీలించారు. అలాగే రాఘవేంద్ర ఇండ్రస్ట్రీస్ రైస్ మిల్ వానకాలం 2023-24 సీజన్కి గానూ గత మార్చి నుంచి నేటికి 12ఏసీకేలు మాత్రమే డెలివరీ చేసిందని, మిగతా 43 ఏసీకేల ధాన్యాన్ని త్వరగా అప్పగించాలని చెప్పారు. అదేవిధంగా మిల్లింగ్ విషయంలో మిల్లర్లకు ఉన్న ఇబ్బందులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మల్లికార్జున ఇండస్ట్రీస్ 2022-23 వానకాలం సీజన్ కేవలం 11 ఏసీకేల ధాన్యం మాత్రమే అప్పగించారని, మిగతా ధాన్యం అప్పగించాలని లేని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్ షేక్ఇర్ఫాన్, డీటీ నందకిశోర్తోపాటు పలువురు అధికారులు ఉన్నారు.