అచ్చంపేట, జూన్ 30 : నిత్యం జన సంచారంతో రద్దీగా ఉండే నల్లమల ప్రాంతం మూడు నెలలు మూగబోనున్నది. అమ్రాబాద్ టైగర్ సఫారీ ప్యాకేజీని నిలిపివేసింది. వన్యప్రాణుల సంతానోత్పత్తి సమయం ఆసన్నం కావడంతో నేటి నుంచి సెప్టెంబర్ 31 వరకు నల్లమలలో సఫారీ టూర్ను అధికారులు నిలిపివేశారు. అక్టోబర్ 1 నుంచి సఫారీ ప్యాకే జీ మళ్లీ ప్రారంభంకానున్నది. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. శ్రీశైలం, ఉమామహేశ్వరం, మద్దిమడుగు ఆలయాల దర్శనానికి యాత్రికు లు వస్తుంటారు. సఫారీ టూర్లో భాగంగా నల్లమల అందాలను తిలకించేందుకు యాత్రికులు ఇష్టపడుతుంటారు. కాగా మూడు నెలల పాటు సఫారీ ప్యాకేజీకి అధికారులు బ్రేక్ ఇచ్చారు. వ న్యప్రాణుల సంతానోత్పత్తికి అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు ఈ చర్యలు చేపట్టారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచారు. ఈ మూ డు నెలల పాటు నిబంధనలకు విరుద్ధంగా నల్లమలలోకి ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు.
అమ్రాబాద్ పులుల అభయారణ్యాన్ని ప్రభు త్వం ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో జూలై 1 నుంచి నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కాగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, 1967 కింద చర్యలు తీసుకోనున్నట్లు అటవీశా ఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. యా త్రికులు నిత్యం శ్రీశైలానికి నల్లమల మీదుగా వెళ్తూ ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు పారవేస్తుంటారు. ఈక్రమంలో వాటిని వన్యప్రాణులు తిని అనారోగ్యానికి గురవడం, అతివేగం వల్ల ప్రమాదాలతో వన్యప్రాణులు మృతిచెందుతున్నాయి. దీం తో ఈ నెల 1 నుంచి వాహనాల్లో ప్లాస్టిక్ కవర్లు, లీటర్లోపు ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకెళ్లినా.. వన్యప్రాణులకు ఆహార పదార్థాలు వేసినా, వాహనా ల వేగం 30 కిలోమీటర్లకు మించినా రూ.వెయ్యి జరిమానాతోపాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు అటవీ వైల్డ్లైఫ్ చీఫ్ వార్డెన్ నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధంపై అటవీశాఖ అధికారులు అవగాహన కల్పిస్తూ వాల్పోస్ట ర్లు విడుదల చే శారు. శ్రీశైలం-హైదరాబాద్ మార్గంలోని మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు ప్రయాణికులు ప్లా స్టిక్ వస్తువులు తరలించకుండా చెక్పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందుకు యా త్రికులు సహకరించాలని డీఎఫ్వో రోహిత్ గోపిడి కోరారు.
నల్లమల అభయారణ్యంలో పెద్దపులుల రక్షిత ఆవాసాలు ఎ క్కువగా ఉన్నాయి. సాధారణం గా 104 నుంచి 106 రోజుల గర్భధారణ సమ యం తరువాత ఆడపులి 1 నుంచి 4 పిల్లలకు జన్మనిస్తుంది. పొడవైన గడ్డి దట్టంగా ఉన్న ప్రదేశం, గుహలవంటి ఏకాంత ప్రదేశాలు లేదా దట్టమైన పొదల్లో పిల్లలను కంటుంది. నల్లమల ప్రాంతంలో 30 పెద్ద పులులు, 170 చిరుతపులులున్నాయి. పెద్దపులులు ఆహార గొలుసునకు ఎగువన ఉన్నాయి. ఇవి జింకలు, ఇతర శాఖాహార జంతువుల జనాభాను నియంత్రణలో ఉం చుతాయి. విస్తారమైన, దట్టమైన అటవీప్రాంతం పెద్దపులుల సంరక్షణకు ఉపయోగపడుతుంది. అడవులు ఒకపెద్ద స్పాంజి వలే నీటి వనరులను భద్రపరుస్తాయి. కార్బన్డై ఆక్సైడ్ను పీల్చుకుంటాయి. ఈవిధంగా అడవులు మానవజాతికి మరెన్నో అమూల్యమైన సేవలను అందిస్తున్నాయి.
కృష్ణానదీ తీరాన ఉన్న ఆకురాల్చు పొడి అటవీ సముదాయం. నల్లమల.. కొండల గుండా విస్తరించి లోతైన లోయలు, అగాధాలతో నిండి ఉంటుంది. అడవిలో మర్రి, తెల్లమద్ది, యాప్పివృక్షం, మూళ్ల బురగచెట్టు, చింత, నేరేడు, టేకు, జిట్రేగి, గుగ్గిలం మొదలైన వృక్షజాతులు ఎక్కువగా కనిపిస్తాయి. అదేవిధంగా వివిధ ర కాల మహావృక్షాలు కూడా ఈ పీఠభూమిపై కనిపిస్తాయి. 66 రకాల గడ్డిజాతులు ఈ ప్రాంతంలో ఉంటాయి. అదేవిధంగా సు మారు 350 రకాల ఔషధ మొక్కలున్నాయి.
నల్లమలలో సుమారు 350 పక్షి జాతులు నివాసముంటున్నాయి. ఇందులో 20 రకాల పక్షి జాతులు అరుదుగా కనిపిస్తా యి. ఫేసరిఫామ్ కుటుంబానికి చెందిన మైనాలు, కాకులు, పిచ్చుకలు, రాబిన్స్ ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. కొంగలు, బుట్టచప్పనాతి, బుల్బుల్, ఫ్లెక్యాచెర్ మొదలైన పక్షి జాతులను ఈ అడవిలో చూడొచ్చు. ఆకుపచ్చ పావురాలు, ప్రూట్ బ్యాక్ (అతి చిన్న గబ్బిలాలు), అత్యంత ప్రమాదకరమైన సాలె పురుగులు (జెమ్స్ స్పైడర్) ఇక్కడ మాత్రమే ఉన్నాయి. అంతరించిపోతున్న బట్టమేకపిట్టకు రోళ్లపాడు వన్యప్రాణి అభయారణ్యం నివాసంగా మారింది.
నల్లమల అభయారణ్యంలో సుమారు 70కి పైగా క్షీరద జాతులు గర్తించబడ్డాయి. క్షీరదాలు శరీరంపై బొచ్చును కలిగి, వాటి సంతానానికి పాలిచ్చే జంతు సమూహానికి చెందినవి. పెద్దపులి, చిరుతపులి, రేగుచుక్క, తోడేలు నల్లమలలో ఉంటే ముఖ్య మాంసాహార క్షీరదాలు. అరుదైన క్షీరదాలలో నీటికుక్క, ర్యాటల్, పునుగుపిల్లి, చేపలుపట్టుపిల్లి, రస్టీస్పాటెడ్ పిల్లి మొదలైనవి అరుదైనవి. బెట్టుడత, చెట్టుచుంచు, దుప్పి, బుర్రజింక, కృష్ణజింక, కొండగొర్రె, మనుబొతు, అడవిపంది, చుక్కల జింక, జంగంపల్లి, ముళ్లపంది వంటి క్షీరదాలు నల్లమల ప్రాంతంలో కనిపిస్తాయి. సహజంగా ఉండే ఉడుత కంటే మూడురెట్లు పెద్దదిగా ఉండే ‘బిట్టుడుత’ నల్లమల అటవీ ప్రాంతంలోనే కనిపిస్తుంది. నెమళ్లు, జింకలు, కోతులు వేలసంఖ్యలో కనిపిస్తాయి.
దేశంలోనే రెండో అతిపెద్ద అభయారణ్యప్రాం తంగా నల్లమల 2611 చ.కీ.మీ.లలో విస్తరించి ఉన్నది. సుమారు 130 కి.మీ.లకు పైగా కృష్ణానది నల్లమల ప్రాంతం మీదుగా ప్రవహిస్తున్నది. ఈ ప్రాంతం 1983లో అభయారణ్యంగా ప్రకటించబడింది. 2014లో తెలుగు రాష్ర్టాల విభజన తర్వాత అమ్రాబాద్ టై గర్ రిజర్వుగా ప్రకటించారు. నల్లమల ప్రాం తంలో లోతైన లోయలతో కూడిన కొండలు కనిపిస్తాయి. అమ్రాబాద్, శ్రీశైలం, పెద్దచెరువు, శివపురం, నెక్కంటి మొదలైన పీఠభూములు ఈ ప్రాంతమంతా విస్తరించి ఉన్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ప్రాంతమంతా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో అడవి జంతువులు పీఠభూములకు పరిమితమై ఉంటాయి. వేసవికాలంలో జంతుజాలం లోయలలో నిత్య నీటివనరుల ప్రాంతాలకు తరలిపోతుంటాయి.