మూసాపేట, జూన్ 28 : మండలంలోని పోల్కంపల్లి శివారులో ఉన్న నల్లకుంట వద్ద శుక్రవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. దీంతో పోలీసుల బందోబస్తు మధ్య మత్స్యకారులు చేపలు పట్టారు. వివరాలిలా.. మూసాపేట మండలంలోని పోల్కంపల్లి శివారులో ఉడిపల్ల చెరువు, ఊరచెరువు, సేరి కుంట, బాలవనికుంట, బాపనికుంటతోపాటు నల్లకుంట చెరువు ఉన్నది. అయితే నల్లకుంటలో చేపలు పట్టే విషయంలో గ్రామానికి చెందిన దళితులు, మత్స్యకారుల మధ్య కొంతకాలంగా పోటీ నడుస్తున్నది. ఆ కుంటలో తమ భూ ములున్నాయని, అందుకే కొన్నేండ్లుగా అందులో చేపలు పడుతున్నామని దళితులు చెబుతున్నారు. ఇందుకోసం కోర్టును ఆశ్రయించినట్లు వారు తెలిపారు. కానీ చెరువులు, కుంటలకు ప్రతి యేటా రు క్కం కడుతున్నాం.. చేపలు పట్టే హక్కు మాకే ఉం దని మత్స్యకారులు అంటున్నారు.
ఈ విషయాన్ని జిల్లా మత్స్యశాఖ అధికారి దండు రాధారోహిణి దృష్టికి తీసుకెళ్లి నల్లకుంటలో చేపలు పట్టుకునేందుకు తమకు పోలీసుల రక్షణ కావాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈక్రమంలో నల్లకుంటలో చేపలు పట్టే హక్కు గ్రామ మత్స్యకారులకే ఉందని, వారికి రక్షణ కల్పించాలని మత్స్యశాఖ తరపున పోలీసులకు లెటర్ పంపించారు. దీంతో శుక్రవారం భూత్పూర్ సీఐ రామకృష్ణతోపాటు మూసాపేట ఎస్సై సుజాత, అడ్డాకుల ఎస్సై శ్రీనివాసులు, చిన్నచింతకుంట ఎస్సై శేఖర్, దేవరకద్ర ఎస్సై నాగన్న ప్రత్యేక సిబ్బందితో నల్లకుంటకు చేరుకున్నారు. మత్స్యకారులు చెరువులోకి దిగి వలతో చేపలు పడుతుండగా దళితులు అక్కడికి వచ్చి వారి ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సీఐ కలుగజేసుకొని మీవద్ద చేపలు పట్టడానికి అనుమతి ప త్రాలు ఉంటే చూయించాలన్నారు. కొన్నేండ్లుగా అందులో చేపలు పడుతున్నామని, తమ వద్ద ఎలాంటి పత్రాలు లేవని వారు తెలిపారు. ఈ సమయంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పోలీసులు వారికి సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.