వనపర్తి, జూలై 2 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వివి ధ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఐదు కిలోమీటర్లు రోజూ నడిచి వెళ్లి చదువును కొనసాగించాల్సి వస్తున్నది. ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నది. జిల్లాలో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రతిరోజూ 1400 మందికి పైగా విద్యార్థులు నడకతో నరకయాతన అనుభవిస్తున్నారు. జిల్లాలో ఒకటి నుంచి పది వరకు 736 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 48,127 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలుండగా వీటితోపాటు మరో 50 వరకు చిన్న గ్రామాలు ఉంటాయి. అయితే గ్రామ పంచాయతీలుగా ఉన్న గ్రామాలకు కూడా ఇప్పటికీ చా లా వరకు ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదు. బీటీ రోడ్లున్నా.. గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. గతంలో ఎవరైనా మా గ్రామానికి బస్సు నడపాలని కోరితే.. రోడ్లు బాగా లేవని చెప్పేవారు. ఇప్పుడు అడుగుతుంటే బస్సులు లేవని.. ఉన్నా బాగాలేవని సమాధానం చెబుతున్నారు. దీంతో ఆర్టీసీ ర వాణా లేని గ్రామాల ప్రజలు, విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు. వనపర్తి జి ల్లాలో బస్సు సౌకర్యం లేని గ్రామాలు నేటికీ 80 వరకు ఉన్నాయి. వీటిలో చాలా గ్రామాలకు బీటీ రోడ్డు సౌ కర్యం ఉంది. కొన్ని గ్రామాలకు మాత్రమే మెటల్ రోడ్లున్నాయి. ఈ గ్రామాల్లోని ప్రజలంతా ప్రైవేట్ రవాణాపై ఆధారపడుతున్నారు. నిత్యావసర సరుకులకు వెళ్లాలన్నా ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. అనారో గ్యం బారిన పడినా అవస్థలు తప్పడం లేదు. చిన్నపిల్లలు, వృద్ధులకు ఏ అవసరం వచ్చినా ప్రయాణం నల్లేరుమీద నడకే అవుతున్నది. సొంతంగా రవా ణా సదుపాయాలు ఏర్పా టు చేసుకుంటే తప్పా మరో మార్గం కనిపించడం లేదు.
జిల్లాలో ప్రతిరోజూ దాదాపు 1,465 మంది విద్యార్థులకు బస్సు ప్రయాణం అందడం లేదని అనధికార అంచనా. 80 గ్రామాల్లో వివిధ స్థాయిలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు బడికి వెళ్లాలంటే నరకయాతన అనుభవించాల్సిందే. వీరిలో కొందరు సైకిళ్ల మీద ఆధారపడితే, మరికొందరు ప్రైవేట్ ఆటోలను ఆశ్రయిస్తున్నా రు. మిగిలిన వారంతా కాలినడకతోనే విద్యాభ్యాసానికి వెళ్లక తప్పడం లేదు. రెండు కిలోమీటర్ల నుంచి 5కిలో మీటర్ల వరకు కాలినడకన బడికి వెళ్లే పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇలా ఒకరోజు కాదు.. రెండు రో జులు కాదు.. ఏడాదంతా కాలినడకన వెళ్లాల్సి రావడం తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రైవేట్ బడుల యాజమాన్యాలు బస్సులను పంపించి విద్యార్థులను ప్రైవేట్ బడులకు తీసుకువెళ్తున్నారు. పేద విద్యార్థులంతా నడకపైనే ఆధారపడి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చదువు సాగించాల్సిన దుస్థితి దాపురించింది.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామనంతపురం గ్రామంలో 5వ తరగతి వరకు సర్కారు పాఠశాల ఉన్నది. ఇక ఆరో తరగతి నుంచి పదో తరగతి చదవాలంటే పాలెం గ్రామానికి మూడు కిలోమీటర్లు నడవాల్సిందే. ప్రతి రోజూ దాదాపు 30 మంది విద్యార్థులు కాలినడకతోనే పాలెంకు వెళ్లి చదువుకుంటున్నారు. ఇక ఇదే గ్రామంలో ప్రైవేట్ బడుల్లో చదువుతున్న విద్యార్థులను ఆయా పాఠశాలల బస్సుల ద్వారా తీసుకెళ్లడం జరుగుతున్నది. ఇలా సర్కారు బడులను నమ్ముకున్న పేద విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి కొనసాగుతున్నది.