‘బోద్ధారో మత్సర గ్రస్తాః ప్రభవః స్మయదూషితాః/ అబోధోపహతాశ్చాన్యే జీర్ణమఙ్గే సుభాషితం’ (సాటి పండితులేమో అసూయగ్రస్తులు, ప్రభువులు అహంకార పూరితులు/ మిగిలినవారు అర్థం చేసుకోలేనివారు / అందుకే నేను చెప్పాలనుకుంటున్న మంచి మాట/ నా లోలోపలే అరిగికరిగిపోతోంది) అంటూ మనసులో బాధపడుతూనే యోగికవి భర్తృహరి నీతి, శృంగార, వైరాగ్య శతకత్రయాన్ని – లోక శ్రేయస్సు కోసం నీతినుపదేశించడానికి రచించాడు.
యోగి కవి భర్తృహరి గురించి: సంస్కృత సాహిత్యంలో యోగికవి భర్తృహరి నీతి, శృంగార, వైరాగ్య శతకకర్తగా, ‘మహాభాష్య’ వ్యాఖ్యానకర్తగా, ‘వాక్యపదీయం’ అనే గ్రంథం రచించిన వైయాకరణుడిగా సుప్రసిద్ధుడు. ‘భర్తృహరి’ అనే పదానికి దేవుడిని భక్తితో ఆరాధిస్తూ దేవుడికే తన జీవితాన్ని అంకితం చేసినవాడని అర్థం- అని పండితవాక్కు.
భర్తృహరి గురించీ, అతడి కాలం గురించీ భిన్న భిన్న కథనాలున్నాయి. భర్తృహరి ఉజ్జయిని రాజు అనీ, అతడి తమ్ముడు విక్రమాదిత్యుడు అనీ, ప్రియ భార్య పింగళ మరొకరితో ప్రేమాయణం సాగిస్తుందని తెలిసి మనసు విరిగిన భర్తృహరి రాజ్యాన్ని తమ్ముడికి అప్పగించి, అడవికి వెళ్లి యోగీశ్వరుడిగా మారాడనీ, ఆ కాలంలోనే శతకత్రయాది రచనలను చేసి ఉంటాడనీ ఒక కథనం! ‘రావణ వధ’ పేరుతో రామాయణాన్ని రాసిన భట్టికవీ, భర్తృహరీ ఒకడేననీ మరో కథనం. భర్తృహరి బౌద్ధ సన్యాసి అని ఇంకో కథనం!
భారతదేశ చరిత్రలో విక్రమశక (క్రీ.పూ.57) మూల పురుషుడూ, తొలి విక్రమాదిత్యుడు మొదలుకొని ఆ పేరూ బిరుదూ గల రాజులు పద్నాలుగుమంది రాజ్యాలేలారు. సముద్ర గుప్తుడి పుత్రుడైన రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడి (క్రీ.శ.375-415) ఆ స్థానంలోని నవ రత్నాలలో ఒకడుగా మహా కవి కాళిదాసు ఉండేవాడు. అతడి ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకంలోని అయిదవ అంకంలో 12వ శ్లోకం ‘భవన్తి నమాస్త రవః.. వైష పరోపకారిణం’ భర్తృహరి విరచిత ‘నీతి శతకం’లో 61వ శ్లోకంగా కనిపిస్తుంది. క్రీ.శ. 6వ శతాబ్దం వాడైన విష్ణుశర్మ రచన ‘పంచతంత్రం’లో – భర్తృహరి ‘నీతిశతకం’లోని 85వ శ్లోకమైన ‘గజ భుజంగ విహంగమ బంధనం’ కనబడుతుంది. కనుక భర్తృహరి, కవి కాళిదాసుకు తక్షణకాలం వాడు, విష్ణుశర్మ పూర్వుడు అనీ, అంటే క్రీ.శ.5వ శతాబ్దానికి చెందినవాడనీ రూఢీ అవుతోంది.
ఇక భట్టికవి క్రీ.శ 7వ శతాబ్దికి చెందిన భామహుడికీ, దండికీ సమకాలీకుడని చరిత్ర చెబుతోంది. క్రీ.శ.691లో భారతదేశానికి వచ్చిన చైనా దేశీయుడు ‘ఇత్సింగ్’ నలందాలో విద్యార్థిగా ఉంటూ భర్తృహరిని బౌద్ధ సన్యాసిగా పేర్కొన్నాడు. భర్తృహరి శాస్త్ర గ్రంథాలపై అతడు ప్రసంగిస్తూ-భర్తృహరి మానవనీతి సూత్రాలనూ రచించాడనీ తెలిపాడు.
భర్తృహరి తన ‘నీతి శతకం’ 1వ శ్లోకంలో ‘ప్రభవః స్మయదూషితాః’ (రాజులు అహంకారపూరితులు) అన్నాడు. తన ‘వైరాగ్య శతకం’ 59వ శ్లోకంలో – మిక్కిలి అల్ప, దరిద్ర నీచ గుణాల రాజుల నుంచి స్వల్పధనాన్ని కూడా ఆశించే పురుషాధములను ఛీ కొట్టాలి’ అని చెప్పాడు. ఇట్లా తన శతక శ్లోకాల్లో రాజులనూ, రాచరికాన్ని నిరసిస్తూ దూషించిన భర్తృహరి రాజవంశానికి చెందినవాడు కాకపోవచ్చునని తోస్తుంది. ‘వైరాగ్య శతకం’ మంగళాచరణ శ్లోకంలో భర్తృహరి ‘చూడోత్తంసిత చారు చంద్ర కలికా… జ్ఞాన ప్రదీపోహరః అంటూ శివుడిని స్తుతించడాన్ని బట్టి శివ భక్తుడనీ తెలుస్తోంది.
‘వైరాగ్య శతకం’ రెండవ శ్లోకం ‘భాన్తం దేశమనేక దుర్గ విషమం’లో ఎవరూ వెళ్లలేని కొండల దాటేసి, ఉండతగని దేశాల్లో సంచరించాననీ, జాతి, కులం, సిగ్గూ వదలి ఎవరెవరికో సేవలు చేశాననీ, ఇతరుల ఇళ్లల్లో కాకి వలె బెదురుతూ కూడు తిన్నాననీ చెప్పుకోవడాన్ని బట్టీ, ఇందులోనే నాల్గవ శ్లోకం ‘ఉత్ఖాతం నిధి శంకయా క్షితితలం’లో నిధుల కోసం భూమిని తవ్వాననీ, బంగారం కోసం కొండమణి శిలల కరిగించాననీ’, సముద్రయానం చేశాననీ, రాజులకిష్టంగా నడుచుకున్నాననీ, మంత్రారాధనలతో స్మశానాల్లో రాత్రుళ్లు గడిపాననీ- అయినా గుడ్డి గవ్వనైనా చూడలేకపోయానని తన కష్టాలను భర్తృహరి వివరించడాన్ని బట్టి అతడు శైవబ్రాహ్మణుడనీ, రాజాశ్రయాల కోసం దేశదేశాలూ తిరిగాడనీ అర్థమవుతోంది. రాజాశ్రయాల్లో బతుకుతూ విధి రాత వల్ల జీవితంలో జరిగిన ఏదో సంఘటనతో యోగిగా మారి ఉంటాడన్పిస్తుంది.
భర్తృహరి శతకత్రయ ప్రశస్తి: చాణక్య శతకం, బాణభట్టు చండీ శతకం, మయూరకవి సూర్యశతకం వంటి ప్రసిద్ధ రచనలు ఉన్నా, భర్తృహరి తాను కష్టాలతో వడబోసిన స్వానుభవాలతో, సంక్షిప్త భావాలతో సహజాలంకారాలతో, సరళశైలిలో రాసిన శతకత్రయ శ్లోకాలు నాటినుంచి ప్రజలనాకట్టుకొని బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఇవి పాశ్చాత్య పండితులనూ ఆకర్షించి డచ్, లాటిన్, గ్రీకు, జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లీషు, వంటి ప్రపంచ భాషల్లోకి అనువాదమయ్యాయి. 17వ శతాబ్దం నుండీ తెలుగులోకి ఎలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణకవి పోచిరాజు వీరన్న, కొక్కొండ వెంకటరత్నం పంతులు మొదలైన ప్రముఖ కవులు పద్యానువాదాలు చేశారు. వీటిలో ‘తివిరి యిసుమున దైలంబు దీయవచ్చు’ అంటూ సూటిగా తేటగా చేసిన ఏనుగు లక్ష్మణకవి పద్యానువాదమే ప్రజల మన్ననలందుకుంది. సంస్కృతంలో భర్తృహరి శతకత్రయానికి మహాబలుడు, ఆవంచ రామచంద్ర బుధేంద్రుడు చక్కని వ్యాఖ్యానాలు రాసినారు.
భర్తృహరి – ‘నీతి శతకమ్’: భర్తృహరి ‘నీతి శతకమ్’ను ‘దిక్కాలాద్యన వచ్ఛిన్నానన్త చిన్మాత్రమూర్తయే’ అంటూ మంగళాచరణ శ్లోకంతో ప్రారంభించి – అనుభవంతో మాత్రమే తెలిసే తేజఃస్వరూపం పరబ్రహ్మమూర్తికి నమస్కరించాడు. ఇందులో మూర్ఖ పద్ధతి, విద్వత్పద్ధతి, మానశౌర్య పద్ధతి, అర్థ పద్ధతి, దుర్జన పద్ధతి, సుజన పద్ధతి, పరోపకార పద్ధతి, ధైర్య పద్ధతి, దైవ పద్ధతి, కర్మ పద్ధతి అనే పది శీర్షికల క్రింద శీర్షికకు పది చొప్పున మొత్తం నూరు శ్లోకాలున్నాయి. శీర్షికను బట్టి వారి వారి, వాటి వాటి స్వభావాలను వర్ణించిన శ్లోకాలు ఇవి. తెలియనివారికి సులభంగా బోధింపవచ్చు, తెలిసినవారికి సుఖతరం తెలియజెప్పవచ్చు, కానీ తెలిసీ తెలియని మూర్ఖులకు చెప్పి రంజింపజేయడం బ్రహ్మతరం కాదని ‘అజ్ఞసుఖమారాధ్య’ (శ్లో.2) శ్లోకంలో చెబుతాడు.
‘భుజకీర్తులూ, చంద్రహారాలూ, చందనాది పూతలూ ఇవేవీ నిజమైన అలంకారాలు కావనీ, సంస్కరింపబడిన మాట ఒక్కటే మనిషికి నశింపని భూషణం’ అని ‘కేయూరాణి న భూషయన్తి’ శ్లోకంలో వివరిస్తాడు. ‘జాతి పాతాళానికి పోయినా, వంశానికి అగ్గి అంటినా, మాకు ద్రవ్యమొక్కటే చాలు ననే ధనవంతుల స్వభావాన్ని ‘జాతిర్యాతు రసాతలం..’ (31) శ్లోకంలో విశదీకరిస్తాడు. ‘సుకవితా యద్యస్తి రాజ్యేన కిం? (17) మంచి కవిత ఉంటే రాజ్యమెందుకు? అనీ ప్రశ్నిస్తాడు. ‘వారాంగానేవ నృపనీతిరనేకరీతిః’ (38) అంటూ రాజనీతి అనేక రీతుల్లో ఉంటుందనీ చురకవేస్తాడు.
జీవితంలో పౌరుషమ్ వృథా అనీ దైవమే శరణమనీ ‘నేతాయస్య బృహస్పతి’ (81) శ్లోకంలో చెబుతాడు. విధి (దైవం) బలవత్తరమైనదనీ అంటాడు. దైవం కూడా కర్మను బట్టి ఫలాన్ని ఇస్తుంది కనుక విష్ణువు పది అవతారాలెత్తడానికి, శివుడు కపాలహస్తుడై భిక్షుకుడవడానికీ, బ్రహ్మ బ్రహ్మాండంలో తన పని నిర్వర్తించడానికీ, సూర్యుడు ఆకాశంలో ఎప్పుడూ తిరగడానికీ కారణమైన సర్వ నియమనశక్తిగల కర్మకు నమస్కారమంటాడు.
పూర్వ పుణ్యం మిక్కిలిగా ఉన్న మనిషికి భయంకరారణ్యమైనా సౌకర్య నగరం అవుతుందనీ, శత్రువులూ ఆత్మీయులవుతారనీ, ధరణి వారికి రత్నాల నిధి అవుతుందనీ- ‘భీమం వనం భవతి తస్య పురం ప్రధానం’ (100 శ్లో.) అనే శ్లోకంతో భర్తృహరి తన ‘నీతి శతకమ్’ను ముగిస్తాడు.‘జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః! నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయమ్!’ (మంచి కృతులను రచించినవారూ, నవరసాలను సిద్ధింపజేసేవారూ అయిన సుకవీశ్వరులు మహనీయులుగా వర్ధిల్లుతారు. వారి కీర్తి దేహాలకు జరా మరణాలతో పుట్టే భయాలేవీ ఉండవు!)
‘రఘువర్మ’
92900 93933