‘మీరు చెప్తే నమ్మరు గానీ ఆ జొన్నరొట్టెలుతండాకు రానన్న ప్రతి వాడి గల్లా పట్టి లాక్కొస్తాయి. మా రొట్టె దేహం నిండాకనబడని పచ్చిదనంజీబ్లోని తడిని పీల్చుకుని నాలుకను నమిలి మింగేస్తుంది..’
అంటూ అచ్చంగా, స్వచ్ఛంగా ఉన్న తన తండా గురించి గుండె మీద అక్షరాల పచ్చబొట్టు పొడుచుకొని ఎలుగెత్తి చెప్తాడు కవి రమేశ్ కార్తీక్ నాయక్, ఊరఫ్ నునావత్ కార్తీక్, మొకాం జక్రాన్పల్లి, వల్ద్ మోజీరాం, సేవంత. ఇప్పుడిప్పుడే అక్షరాల ఒడిలో ఓనమాలు దిద్ది, అంబాడుతున్న ఈ లంబాడీ పిల్లగాని ‘జారెర్ బాటి’ కవిత ఖమ్మం డిగ్రీ కళాశాల విద్యార్థులకు పాఠ్యాంశం. అంతేకాదు, ఈ తెలంగాణ పిల్లగాని కవితల ‘బల్దేర్ బండి’ని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎం.ఏ. పాఠాల్లో చేర్చింది.
తెలుగు సాహిత్యంలో అస్తిత్వవాద చైతన్యం ఇవ్వాల్టిది కాదు, అట్లని ఇంతకుముందు గిరిజన జీవితాలు, తండాలు మన సాహిత్యంలో లేవనీ కాదు. అందులోనూ గిరిజన, ఆదివాసుల జీవితాలను అనేక మంది గతంలో చిత్రించారు కూడా. పద్దం అనసూయ, మల్లీపురం జగదీశ్, కుంజ కళ్యాణి, ఆత్రం మోతీరాం, హాతీరాం, బట్టు విజయ్ వంటి ఆదివాసీ, సంచారజాతుల రచయితలు మొదలు, వి.ఎన్.వి.కె.శాస్త్రి, ఎ.విద్యాసాగర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, సమ్మెట ఉమాదేవి వంటివారిని నేను చదివాను. వీరితో పాటు ఇంకొందరు ఉన్నప్పటికీ ఇక్కడ పేర్కొనడం లేదు. తండాలో పుట్టి, ఎదిగి… ఇవ్వాళ అక్కడి జీవితాలను, ఎతలను, బాధలను, గెలుచుకున్న జీవితాలను అక్షర చిత్రాలుగా మలుస్తున్న వారిలో నాకు ఆత్మీయులైన ఇద్దరున్నారు. ఒకరు బంజారాల బతుకమ్మ సూర్యాధనంజయ్, కాగా మరొకరు నేను పైన జెప్పిన రమేశ్ కార్తీక్ నాయక్.
రమేశ్ కార్తీక్ సర్కారు హాస్టల్లో ఉండి చదువుకొని బతుకు వేట కోసం పట్నం వచ్చినవాడు. ఆశ్చర్యంగా ఇరవై ఆరేండ్ల వయసులో ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం గెలుచుకొని ఇవ్వాళ వార్తల్లో నిలిచాడు. ఈ పురస్కార గ్రహీతల వరుసలో రమేశ్ 14వ వాడు. తన మాతృభాష గోర్ బంజారా భాషతో పాటు విద్యార్థిగా తాను చదువుకున్న తెలుగులో, ఆంగ్లంలో రచనలు చేస్తున్న రమేశ్ కవి, కథకుడు, అనువాదకుడు, టీవీ యాంకర్, వృత్తిరీత్యా ప్రైవేటు కళాశాలలో ఆంగ్లోపన్యాసకుడు. రచయితగా రమేశ్ తన నేపథ్యాన్ని, జీవితాన్ని, తన ఇరుగు పొరుగుల ఇంట్లో చూసిన జీవితాలను రచనలుగా అచ్చు వేశాడు. నిఖార్సయిన బంజారా జీవితాలను ప్రధాన స్రవంతిలో చేర్చి కావ్యగౌరవాన్నిచ్చాడు. ‘బల్దేర్ బండి’ రమేశ్ కవితా సంపుటి, ఆచార్య సూర్యాధనంజయ్తో కలిసి ‘కేసులా’ గోర్ బంజారా కథల సంకలనం తెచ్చాడు. ‘చక్మక్’ పేరుతో ఇంగ్లీషులో కవితా సంపుటి ప్రచురించాడు.
సాహిత్య అకాడమీ యువ పురస్కారం గెలుచుకున్న రమేశ్ పుస్తకం ‘ఢావ్లో’ గోర్ బంజారా కథలు. ఢావ్లో పదానికి అర్థం విషాద గీతం. ఇందులోని ఢావ్లో కథకు పుట్టింటిని విడిచిపోవడంలోని పెండ్లి కూతురు ఆవేదనతో తనవాళ్లందరిని తలుచుకుంటూ పాడే పాట ఇతివృత్తం. తన కథల్లో కేవలం తనవారి వెతలను, పండుగలు పబ్బాలను చెప్పి ఊరుకోలేదు రమేశ్. ప్రభుత్వ కార్యక్రమాలు, నాయకుల ఊరేగింపులు, జులూస్ల వంటి సమయాల్లో లంబాడాలను, వారి నృత్యాలను వాడుకోవడం పట్ల ఆవేదనతో కొంత ధర్మాగ్రహాన్ని కూడా తన కథల్లో ప్రదర్శిస్తాడు. ఇందులోని కథలన్నీ బంజారాల వ్యవసాయక జీవనం, విధానంతో పాటు అనేక అంశాలకు అద్దంగా నిలుస్తాయి. అటువంటి కథల్లో బర్రె నేపథ్యంగా వచ్చిన కథ ‘పాడ్గి’. సేవు, సంగ్యాల సంసారంలో ఈతకొచ్చిన బర్రె చుట్టూ సాగే ఈ కథ జంతువులతో బంజారాల అనుబంధాన్ని చిత్రించిన రచన.
ఈ కథల్లోని జీవితాలే కాదు పాత్రలు, సంభాషణలు బంజారా స్త్రీలు ధరించే చమ్కీల అద్దాల్లాగే మెరుస్తాయి. ‘లతకడా’ దర్మ్యా అనే బాలుని కథ. పందుల నుంచి జొన్న చేన్లను ఎట్లా కాపాడుకుంటారో చెప్తాడిందులో. వలలతో తండాకు దూరమైన బంజారాలు అనేక మందిని రోజూ పట్నాల్లో చూస్తూనే ఉంటాం… అటువంటి ‘మనిషి’ కథ రమేశ్ రాసిన ‘ధర్మిబాయి’ పనిమనిషి కథ. తాను సృష్టించిన ప్రతి పాత్ర ఎక్కడో తారసపడ్డట్టు అనిపించడం రమేశ్ రచనలోని ప్రత్యేకత.
కవిగా, రచయితగా దాదాపు దేశంలో జరిగిన అన్ని ప్రతిష్ఠాత్మక లిటరరీ ఫెస్టివల్లలో పాల్గొన్న రమేశ్, మన తెలుగు రాష్ర్టాల ఆదివా సి, గిరిజన, సంచార సమూహాల నుంచి సాహి త్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి యువ రచయిత. అంతేకాదు బంజారా సమూహం నుంచి వచ్చిన తొలి కథా సంపుటి ‘ఢావ్లో’ కావడం విశేషం. తెలంగా ణకు మరో యువ సాహిత్య పురస్కారాన్ని అందించిన రమేశ్కు అలాయి బలాయి.. దిల్సే ముబారక్ బాద్!
(రమేశ్ కార్తీక్ నాయక్కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చిన సందర్భంగా…)
– డాక్టర్ పత్తిపాక మోహన్ 99662 29548