కథ, నవలా రచయిత, కవి, కాలమిస్ట్, మాటల రచయిత, స్క్రీన్ప్లే రైటర్, నటుడు, పిల్లల ప్రేమికుడు, బాలల నవలా కారుడు, సాహిత్యాన్ని కళంకితం చేయని విశిష్ట మానవతావాది పమిడిముక్కల చంద్రశేఖర్ ఆజాద్. గుంటూరు జిల్లా, భట్టిప్రోలు మండలం, వెల్గటూరు గ్రామంలోని పమిడిముక్కల విజయలక్ష్మీ, లక్ష్మణ్రావు దంపతులకు 1995, మే 24న చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు.
చిన్ననాటి నుంచే సాహిత్యంపై ఆజాద్ మక్కువ పెంచుకున్నారు. 1971లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కాలేజీ సావనీరుకు ‘నిరుద్యోగి (ఆత్మహత్య)’ అనే కథను రాశారు. 1972లో ఇంటర్ పాసైనా పై చదువులకు వెళ్లలేకపోయారు. ఆరుగురు సభ్యుల కుటుంబ భారం ఆజాద్ మీద పడింది. అందుకే తెనాలి చేరుకొని, తన బావ హోటల్లో పనికి కుదిరారు.
నాడే ఆజాద్ పేదల సంక్షేమం గురించి, సమాజం బాగోగుల గురించి రాజకీయ నాయకులకు ఉత్తరా లు రాసేవారు. ఆజాద్ భావాల తీవ్రత ను కనిపెట్టి, అడవుల్లోకి వెళ్లే ప్రమా దం ఉన్నదని గ్రహించిన తల్లిదండ్రు లు 1974లో 18 ఏండ్ల వయస్సులో నే పెండ్లి చేశారు. తర్వాత రొయ్యలు కొట్టడం, పాన్షాప్ నడపడం వంటి పనులను కుటుంబ జీవిక కోసం చేశారు.
1975లో హైదరాబాద్ చేరుకొని, నవభారత్ టొబాకో కంపెనీలో చేరారు. చిన్ననాటి నుంచి సినిమాల్లోకి వెళ్లాలనే కోరికతో మద్రాస్ పంపిస్తాననగానే చేస్తున్న పని వదిలేసి, ఓ వ్యక్తి వెంట బయలుదేరారు. ఆయన రాజమండ్రిలో దింపి, ఇక్కడే చేపల పని చేయాలని చెప్పారు. అది నచ్చక మళ్లీ భాగ్యనగరం చేరుకొని, నాన్నగారి స్నేహితుడి ద్వారా ఏపీఎస్ఆర్టీసీలో రోజుకు పది రూపాయల కూలీకి కుదిరారు. అందులో పనిచేస్తూనే, జీవితం కొట్టిన దెబ్బలకు రచయితగా మారి, గాయాలకు లేపనం పూసుకుంటూ సాహిత్య ప్రస్థానం సాగిస్తున్నారు.
అపరాధక పరిశోధన నవలతో మొదలుపెట్టి, బాలల కథలు, నవలలు, పెద్దల కథలు, టీవీ సీరియళ్లు, మాటలు, స్క్రీన్ప్లేలు, ఇలా ఒకటి కాదు, తన నలభై ఏండ్ల సాహిత్య ప్రస్థానంలో స్పృశించని వచన ప్రక్రియ లేదు. ఆజాద్ రచనలు ముద్రితం కాని పత్రిక లేదు. రోజుకు 18 గంటలు రచనలు చేసేవారు. 900 కథలు, 80 నవలలు, 500 ఎపిసోడ్స్కు మాటలు రాయడమే కాకుండా అనేక టీవీ సీరియల్స్లోనూ నటించారు. 30 నవలలకు జాతీ య, అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు వచ్చాయి. రెండు నంది అవార్డులు వరించా యి. కొన్ని పత్రికల్లో ‘పిల్లల ప్రపంచం’, ‘చుక్ చుక్ రైలు’, ‘వాయిస్ ఆఫ్ చిన్ని’, మొదలగు శీర్షికలతో బాలల శీర్షికలను నిర్వహించారు. ఆజాద్ సినిమా రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.
జమీందారు కోట, మా హృదయం, అందమైన పూలతోట, దారితప్పిన పిల్లవాడు, దేవతా ఓ దేవతా, ఆట, పిల్లల ప్రపంచం, బిట్టు దేవత మొదలైన నవలలు రాశారు. 2021లో తానా పోటీలో బహుమతి పొందిన పిల్లల నవల ‘మాయా లోకం’. ఇదే నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించడం ముదావహం. నలుగురు పిల్లల చుట్టూ తిరిగే, ఆసక్తి కలిగించే అంశంతో నడిచే నవల అశేష పాఠకులను ఆకట్టుకుంది. తాను రాసిన నవలల్లో పిల్ల పాత్రలే ఎక్కువ ఉంటాయి. ఆజాద్ తన డబ్భు ఏండ్ల వయసులోనూ కలం వదలకుండా సాహితీ సేద్యం చేస్తూనే ఉన్నారు.
‘మన బాల రచయితలు పంచతంత్ర కథల పరిధిని దాటి రాయలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. పాఠకులను పెంచుకోవాలి. బాల సాహిత్యంలో ఆధునికత రావాలి. ఆధునిక పిల్లల అంతరంగాలకు అనుగుణంగా రచనలు చేయాలి. మనం రాసే రచనలు జాతీయంగా, అంతర్జాతీయంగా పేరు తెచ్చుకునేలా కృషిచేయాలి’ అని సూచించారు.
(పి.చంద్రశేఖర్ ఆజాద్కు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం వచ్చిన సందర్భంగా…)
– పుప్పాల కృష్ణమూర్తి 99123 59345