ప్రస్తుతం భూమిని పట్టి పీడిస్తున్న కాలుష్య సమస్యల్లో ప్రధానమైనది ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ. వందల సంవత్సరాలు గడచినా నేలలో కలిసిపోని ప్లాస్టిక్తో కలిగే అనర్థాలు ఎన్నో! టన్నుల కొద్దీ ప్లాస్టిక్ గుట్టలుగా పేరుకుపోతున్న తరుణంలో ప్రత్యామ్నాయాల వాడకానికి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాలు జిల్లాకు చెందిన సుబిమల్ దత్తా ఈ పనే చేస్తున్నాడు. విద్యాసాగర్ విశ్వవిద్యాలయం నుంచి సోషల్ వర్క్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన దత్తా తమ జిల్లా ప్రజలకు ప్లాస్టిక్తో కలిగే ప్రతికూల ప్రభావాల గురించి వివరిస్తున్నాడు.
మనం పారవేసే ప్లాస్టిక్ వ్యర్థాలను సరిగ్గా నిర్వహించకపోతే అవి నాలాలు, కాలువలు, నదుల ప్రవాహాలను ఎలా అడ్డుకుంటాయో, వరదలకు ఎలా కారణమవుతాయో, రకరకాల వ్యాధి కారక క్రిములకు నిల్వగా ఎలా మారిపోతాయో విడమర్చి చెబుతున్నాడు. కేవలం అవగాహన కల్పించడం మాత్రమే కాకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్వహించడం ఎలాగో ప్రయోగాత్మకంగా పరిష్కారాల ద్వారా కూడా సూచిస్తున్నాడు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఉన్న నేలలో క్షయం చెందే బయోడీగ్రేడబుల్ వస్తువుల వాడకాన్ని, వాడేసిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ను ప్రోత్సహిస్తున్నాడు.
తన ప్రయత్నాల్లో భాగంగా దత్తా స్థానిక అధికారులు, విద్యా సంస్థలు, పౌర సమాజ సంస్థల సహకారం కూడా తీసుకుంటున్నాడు. అందరూ కలిసి పరిశుభ్రత గురించి ప్రచారం చేయడం, రీసైక్లింగ్ వర్క్షాపులు నిర్వహించడం, పరిష్కార మార్గాల అన్వేషణ మొదలైన ప్రయత్నాలు చేస్తున్నారు. అలా సుస్థిరమైన అభివృద్ధి కోసం అందరూ కలిసి పాటుపడుతున్నారు. కేవలం కనిపించే ప్లాస్టిక్ గుట్టల గురించి మాత్రమే కాకుండా మామూలు కంటితో చూడలేని మైక్రోప్లాస్టిక్ ద్వారా మనిషి, జంతువుల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాల గురించి కూడా దత్తా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నాడు.
ఇక ప్లాస్టిక్ లేని పరిసరాలను రూపొందించడం అనేది ఉత్తర 24 పరగణాలు జిల్లాకు ఆవల కూడా జరగాలన్నది ఆయన ఆకాంక్ష. ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించడంతోపాటు ప్రకృతికి అనుకూలంగా ఉండే సుస్థిరమైన అభివృద్ధి విధానాలను అందరూ అనుసరించాలని దత్తా లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ దిశగా అందరి సహకారం కోరుకుంటున్నాడు. మనవంతుగా మనమూ ప్లాస్టిక్ వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గించుకుందామా!