ఏదైనా సాధించినప్పుడు ప్రతి ఒక్కరూ పబ్లిసిటీ కోరుకుంటారు. తాము సాధించిన ఘనత పదిమందికీ తెలియాలని ఆరాటపడతారు. కానీ అన్ని విషయాలనూ ప్రచురించే వీలు, సమయం మీడియాకు ఉండదు. అలాంటి సమస్యకు పరిష్కారంగా రూపొందిన వేదికే ‘Your Story’. ఈ వేదికపై ఎవరి స్టోరీని వాళ్లే చెప్పుకోవచ్చు. ఎలాంటి తప్పులు, అతిశయోక్తులకు తావులేకుండా తమ ప్రయాణంలోని కష్టాలు, కన్నీళ్లను విజేతలు పంచుకోవచ్చు. ఈ అరుదైన వేదికను రూపొందించిన శ్రద్ధా శర్మ నేపథ్యం, ఇలాంటి ఓ వేదికను రూపొందించాలనే ఆలోచన వెనుకగల కారణాలు అనేకం.
శ్రద్ధా శర్మ బీహార్లోని పాట్నాలో జన్మించింది. అలహాబాద్, ఢిల్లీలో చదువు పూర్తి చేసుకుని జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించింది. పలు ప్రముఖ జాతీయ మీడియా సంస్థల్లో పనిచేసిన శ్రద్ధ వృత్తిలో భాగంగా చాలామంది పారిశ్రామికవేత్తలతో ముచ్చటించి వారి విజయగాథలను తెలుసుకున్నది. అయితే ఆ సమయంలో ఆమె యువ మహిళా పారిశ్రామికవేత్తలకు తగిన ప్రాధాన్యం లేదని గుర్తించింది. సక్సెస్ స్టోరీల్లో మహిళా విజేతలనూ చేర్చాలనే ఆమె ప్రతిపాదనను పలు చానెళ్లు తిరస్కరించాయి. దీంతో విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని 2008లో ‘యువర్స్టోరీ’ వేదికను స్థాపించింది. ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఎవరైనా తమ విజయగాథను ఇతరులతో పంచుకోవచ్చు.
ప్రారంభం నుంచే యువర్స్టోరీ విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ వెబ్సైట్లో 70వేలకు పైగా విజయగాథలు ఉన్నాయి. పదకొండు స్థానిక భాషల్లో కంటెంట్ అందించే వందమంది బృందానికి శ్రద్ధ నేతృత్వం వహిస్తున్నది. ఈ సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్ను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నందుకు ఆమె లోరియల్ పారిస్ ఫెమినా అవార్డు అందుకున్నది. ప్రపంచంలోని టాప్ 500 లింక్డ్ఇన్ ఇన్ఫ్లూయెన్సర్ల జాబితాలో చోటు దక్కించుకున్నది. భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన మహిళా ఆంత్రప్రెన్యూర్గా నిలిచింది.