ఎంతో ఎత్తుకు ఎదగాలని కలలు కనడం సాధారణమైన కోరిక. అందరూ చేరుకోలేనంత.. కాదు కాదు… ఎవరూ కోరుకోనంత ఎత్తుకు చేరిందామె. అంతెత్తున ఎదిగిన వాళ్లని ప్రపంచం ఎరుగక ఉంటుందా? గగనతల యుద్ధ రంగం నుంచి అంతరిక్షం దాకా సాగిన ఆమె ప్రయాణం అద్భుతం… సాహసం! మూడోసారి అంతరిక్ష యానానికి బయల్దేరిన నాటి యుద్ధనారి, నేటి సాహసనారి సునీతా విలియమ్స్ గురించి కొన్ని విశేషాలివి.
సునీతా విలియమ్స్ భారతీయ మూలాలున్న అమెరికా జాతీయురాలు. ఆమె తండ్రి డాక్టర్ దీపక్ పాండ్య గుజరాత్ వాసి. ఆయన అమెరికా జాతీయురాలైన బోనీని వివాహం చేసుకున్నాడు. అమ్మానాన్న ఆమెకు సునీతా పాండ్య అని పేరు పెట్టుకున్నారు. అమెరికా జాతీయుడైన ఫెడరల్ పోలీస్ ఆఫీసర్ మైఖేల్ జె. విలియమ్స్ని పెళ్లి చేసుకొని సునీతా విలియమ్స్ అయింది.
పర్షియన్ గల్ఫ్ యుద్ధ సమయంలో సునీత అమెరికా యుద్ధ నౌకలకు రక్షణగా ఉండే హెలికాప్టర్లను నడిపింది. మధ్యప్రాచ్యం, ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్లో జరిగిన యుద్ధాల్లో పాల్గొన్నది. అమెరికాలో 1992లో హరికేన్ ఆండ్రూ సంభవించినప్పుడు మియామి ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టింది. యుద్ధాలు, విపత్తుల సమయంలో పనిచేసిన అనుభవం సునీత గుండె ధైర్యాన్ని పెంచింది.
నావల్ అకాడమీలో టెస్ట్ పైలట్, టెస్ట్ పైలట్
ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన కాలంలో సునీత 30 రకాల ఎయిర్క్రాఫ్ట్లను నడిపింది. యుద్ధ సమయాల్లో, శిక్షణలో భాగంగా దాదాపు 2,770 గంటలు యుద్ధ విహంగాలను గింగిరాలు కొట్టించింది. దశాబ్ద కాలం సాహస ప్రయాణాలు చేసిన సునీత అనూహ్యంగా ఉత్తర అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)లో అవకాశం అందిపుచ్చుకుంది. విమానాలు నడపడంలో, మరమ్మతుల్లో నైపుణ్యం ఉన్నవారిని నాసా వ్యోమగామిగా ఎంపిక చేస్తుంది. అలా 1998లో నాసాలో అడుగుపెట్టిందామె. నాసాతోపాటు రష్యాలోనూ వ్యోమగామి శిక్షణ పొందింది.
యు.ఎస్.నావల్ అకాడమీలో ఫిజికల్ సైన్స్లో బ్యాచ్లర్ డిగ్రీ చదివింది సునీత. ఆ తర్వాత ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఇంజినీరింగ్ మేనేజ్మెంట్) పూర్తిచేసింది. వెంటనే అమెరికా నావికా దళంలో ఏవియేటర్ (గగనతల యుద్ధ సైనికురాలు)గా కెరీర్ మొదలుపెట్టింది. దశాబ్దకాలం యుద్ధాల్లో పాల్గొన్నది. యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీలో చేరిన సునీత నావల్ ఏవియేషన్ (యుద్ధ నౌక రక్షణ కోసం ఎయిర్ ఫైటర్లను నడిపే పైలట్) శిక్షణ తీసుకున్నది.
అంతరిక్ష నౌక స్పేస్ షటిల్ డిస్కవరీలో 2006 డిసెంబర్ 14న ఫ్లైట్ ఇంజినీర్గా సునీత మొదటిసారి గగనాంతర రోదసికి పయనమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరి నాలుగుసార్లు స్పేస్ వాక్ చేసింది. ఈ నాలుగు దఫాల్లో మొత్తం 29 గంటల 17 నిమిషా లు అంతరిక్ష కేంద్రం బయట గడిపింది. స్పేస్ స్టేషన్లో ఉన్నపుడు బోస్టన్ (అమెరికా)లో ఓ మారథాన్ పోటీ జరిగింది. అందులో పాల్గొనాలని సునీత కోరిక. అంతరిక్ష కేంద్రంలో ఉండే, ట్రెడ్ మిల్పై 42.2 కిలోమీటర్లకు సమానమైన పరుగు తీసింది! 195 రోజులపాటు అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించిన ఆమె 2007 జూన్ 22న నేలకు దిగి వచ్చింది.
2011లో మళ్లీ స్పేస్ స్టేషన్లో పనిచేసే అవకాశం ఆమెకు వచ్చింది. ఈసారి రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ కలగలిసి ఉండే ట్రయథ్లాన్లో పాల్గొన్నది. స్పేస్ స్టేషన్లో ట్రెడ్మిల్ మీద రన్నింగ్ చేసిన తర్వాత సైకిల్ తొక్కింది. ప్రత్యేక పరికరాలతో తయారు చేసిన వెయిట్లిఫ్ట్ మెషిన్పై ఈత కొట్టినట్టుగా కసరత్తులు చేసి ట్రయథ్లాన్ ముగించింది. రెండోసారి అంతరిక్ష యాత్రలో మూడుసార్లు స్పేస్ వాక్ చేసి, 21 గంటల 23 నిమిషాలపాటు స్పేస్ స్టేషన్ బయట గడిపింది. 127 రోజుల తర్వాత భూమికి తిరిగి వచ్చింది. అమెరికా వ్యోమగామి పెగ్గీ విట్సన్ తర్వాత అత్యధిక రోజులు అంతరిక్షంలో ఉన్న మహిళగా సునీతా విలియమ్స్ చరిత్రలో నిలిచిపోయింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మొత్తంగా 321 రోజులపాటు ఉండి వచ్చింది.
అంతరిక్ష కేంద్రం చేరుకోవడం సాహసమే. అక్కడి అనుభూతి అద్భుతమే. కానీ, రోజుల తరబడి అక్కడే ఉండటం అందరూ చేయలేని సాహసం. సునీత ముచ్చటగా మూడోసారి సుసాధ్యం చేసింది! ఇప్పుడు ఈ వ్యోమనారి వయసు 58 సంవత్సరాలు. వాణిజ్య అంతరిక్ష నౌకలను ప్రయోగించేందుకు నాసా ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో ఆమె ఒకరు. స్పేస్ ఎక్స్, క్రూ డ్రాగన్, స్టార్లైనర్ లాంటి వాణిజ్య అంతరిక్ష నౌకలను అంతరిక్షంలోకి తీసుకుపోయే బృందంతో గగనానికి దూసుకుపోయింది. బోయింగ్ కంపెనీ రూపొందించిన గోళాన్ని పోలిన స్టార్ లైనర్ అంతరిక్ష నౌక విజయవంతంగా బయలుదేరింది. మరికొన్ని రోజులు అంతరిక్షంలో విధులు నిర్వర్తించి ఆమె కొత్త రికార్డులు నెలకొల్పాలని ఆశిద్దాం.