వానాకాలం వచ్చిందంటే వర్షాలు, వరదలతో పాటు జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి అనారోగ్య సమస్యలు కూడా సర్వసాధారణం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక సమయంలో వర్షంలో తడవడం ఖాయం. కొందరికి చిరుజల్లుల్లో తడిసినా జలుబు పట్టుకుంటుంది. జ్వరం వస్తుంది. అయితే, ఒళ్లు వేడెక్కగానే పొలోమని ఆస్పత్రికి పరిగెత్తకుండా ఇంట్లోనే తేలికపాటి చిట్కాలు పాటించి సత్వర ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే…
తుమ్ములు వస్తున్నాయంటే.. అది జలుబును మోసుకొస్తుందని అర్థం. సర్దికి సర్ది చెప్పాలంటే ఆవిరి పట్టడం ఒక్కటే మార్గం. మరిగే నీటిలో చిటికెడు పసుపు, నాలుగు చుక్కల జిందా తిలిస్మాత్ వేసి ఆవిరిపడితే జలుబు తోకముడుస్తుంది. తలపోటు ఉన్నా ఎగిరిపోతుంది.
గోరువెచ్చని పాలలో పసుపు వేసుకుని తాగడం అలవాటు చేసుకోవాలి. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జలుబు, తుమ్ముల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. గోరు వెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు వేసుకుని రాత్రి పడుకునే అరగంట ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
గొంతు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి అల్లం రసం, తేనె దివ్యౌషధంగా పనిచేస్తాయి. అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జలుబు, తుమ్ములను తగ్గిస్తాయి. అల్లం రసానికి సమానంగా తేనె కలుపుకొని తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది.
గొంతు నొప్పితో బాధపడేవాళ్లు గోరువెచ్చని నీళ్లలో ఉప్పు వేసుకుని ఆ నీటితో నోరు పుక్కిలించాలి. ఉప్పులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గొంతు ఇన్ఫెక్షన్తో పోరాడి త్వరిత ఉపశమనం కలిగిస్తాయి.
తులసి, నల్ల మిరియాలు కూడా వర్షాకాలం వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ఒక కప్పు నీటిలో కొన్ని తులసి ఆకులు, మిరియాల పొడి వేసి బాగా మరిగించి తాగడం వల్ల జలుబు, తుమ్ముల సమస్యను అరికట్టవచ్చు.