సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే పౌష్టిక ఆహారాల్లో ఒకటి పాలు. వయసుతో సంబంధం లేకుండా మన దేశంలో ఎక్కువ మంది పరగడుపున, రాత్రి పడుకునే ముందు పాలు తాగుతుంటారు. పెరుగు, వెన్న, పనీర్ లాంటి పాల ఉత్పత్తుల వాడకమూ ఎక్కువే. ఇక టీ, కాఫీల్లో పాలదే ప్రథమ స్థానం. ఎంత చిక్కటి పాలు కలిపితే అంత రుచి అంటూ చిక్కటి టీ, కాఫీలు లాగిస్తుంటారు భారతీయులు. అయితే పాలల్లో అపారమైన పోషకాలు ఉండే మాట వాస్తవమే అయినప్పటికీ అందులోని లాక్టోజ్ని అరిగించడానికి ఉపయోగపడే లాక్టేజ్ స్థాయిలు కొందరిలో తక్కువగా ఉంటాయి. ఇలాంటి వారికి పాలు తాగడం వల్ల ఫలితం అందకపోగా, ఉబ్బరం, విరేచనాలు, వికారం, వాంతులు తదితర సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
మనం తాగే పాలను అరిగించుకోవడానికి మన చిన్నపేగులో విడుదలయ్యే లాక్టేజ్ ఉపయోగపడుతుంది. కానీ, కొంతమందిలో ఈ ఎంజైమ్ ఉత్పత్తి సరిగా లేకపోవడం వల్ల వారికి పాలు జీర్ణసంబంధ ఇబ్బందుల్ని కలిగిస్తాయి. పాలల్లోని లాక్టోజ్ని విచ్ఛిన్నం చేయడానికి లాక్టేజ్ అవసరం. దీనిని కిణ్వ ప్రక్రియ అంటారు. పాలు తాగడం వల్ల అజీర్తి, ఉబ్బరం వంటి సమస్యల్ని ఎదుర్కొనేవాళ్లు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు.
పాలను హరాయించుకునే శక్తిలేని వ్యక్తులు డెయిరీ ఉత్పత్తులకు బదులు బాదం, సోయా, ఓట్ మిల్క్ వంటి వాటిని ప్రయత్నించవచ్చు. పెరుగు, పనీర్ వంటి పులిసిన డెయిరీ పదార్థాలను తినడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు ఏర్పడవు. వైద్యుల సలహాతో పాల ఉత్పత్తులు తీసుకునే ముందు లాక్టేజ్ ఎంజైమ్ సప్లిమెంట్స్ని తీసుకోవచ్చు. డెయిరీ ఉత్పత్తులు తీసుకున్నప్పుడు తరచుగా అజీర్ణం, విరేచనాలు, వికారం, వాంతులు వంటి సమస్యల్ని ఎదుర్కొంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.