పాల్వంచ, జూన్ 19 : ‘ఆరు గ్యారెంటీలు అన్నారు.. అరచేతిలో వైకుంఠం చూపారు.. తీరా చూస్తే అర్హతను అడుగున పడేశారు. అదేమిటని అడిగితే.. ఆప్షన్లు లేవని చల్లగా చెబుతున్నారు.. గృహజ్యోతి అంటూ మాకు సరైన గుణపాఠమే చెప్పారు..’ ఇదీ.. జీరో బిల్లులు రాని అర్హులైన పేదల ఆవేదన. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ‘మాది ప్రజాపాలన’ అంటూ పరుగులు పెట్టారు ఆ పార్టీ పాలకులు. ఎన్నికలప్పుడు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో అర హామీని కూడా ఆగనీయబోమంటూ హడావిడి చేశారు. వెనువెంటనే ‘ప్రజాపాలన’ అంటూ గ్రామసభలు పెట్టారు. ఆరు గ్యారెంటీలకు అర్హులైన ప్రజలంతా దరఖాస్తు చేసుకోవాలంటూ ఊదరగొట్టారు. అంతా నిజమేనని నమ్మిన.. అసలైన అర్హులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అర్హతగల వాటికి దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా ‘గృహజ్యోతి’ కోసం వెల్లువలా దరఖాస్తులు చేసుకున్నారు. ‘నెలకు 200 యూనిట్లలోపు వినియోగిస్తే సొంతింట్లో ఉన్న వాళ్లకు, అద్దెంట్లో ఉన్న వాళ్లకు ఉచితంగా కరెంటు’ అని ఊరూరా ప్రచారం చేయడంతో అర్హులందరూ తమ విద్యుత్ మీటర్ల వివరాలు, రేషన్ కార్డుల నంబర్లు, ఆధార్, నివాస వంటి ధ్రువీకరణ పత్రాలను గ్రామసభల్లో అందజేశారు. వాటన్నింటినీ తీసుకెళ్లిన అధికారులు.. వివరాలను క్రోడీకరించుకొని అన్నింటినీ ఆన్లైన్ చేశారు.
కానీ.. ఇక్కడే అసలు అలక్ష్యం బయటపడింది. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేటప్పుడు చాలామంది దరఖాస్తుదారుల వివరాలు తప్పుగా ఎంటర్ చేశారు. దీంతో అర్హులైన ఎంతోమంది అనర్హులుగా మిగిలిపోయారు. దీంతో ఆ తరువాతి నుంచి వారికి జీరో బిల్లు రావడం లేదు. ఉచిత కరెంటు వర్తించనందున బిల్లు మొత్తం చెల్లించాల్సిందేనంటూ విద్యుత్ సిబ్బంది ఇళ్లకొచ్చిమరీ చెప్పి వెళ్తున్నారు. దీంతో లబోదిబోమంటూ దరఖాస్తుదారులంతా ప్రభుత్వ కార్యాలయాలకు పరుగులు తీశారు. పరుగున వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పోటెత్తడంతో, పత్రికల్లో కథనాలు రావడంతో ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి ఎట్టకేలకు స్పందించారు. అర్హత ఉన్నప్పటికీ జీరో బిల్లు రాకపోతే ఆందోళన చెందవద్దని, తాము సరిచేసేలోపు బిల్లులెవరూ చెల్లించాల్సిన అవసరం లేదని సెలవిచ్చారు. ఆ మాట విని కూడా ఆరు నెలలు దాటిపోయింది. ఇప్పటికీ అర్హులకు న్యాయం జరిగింది లేదు. ఉచిత విద్యుత్ ఇచ్చింది లేదు. దీంతో ఏ నెలకు ఆ నెల విద్యుత్ బిల్లుల బకాయిలు పేరుకుపోతుండడంతో దరఖాస్తుదారుల గుండెల్లో భారం పెరిగిపోతోంది. ఇన్నాళ్లూ ఎన్నికల కోడ్ పేరుతో కాలయాపన చేసిన పాలకులు.. ఇప్పటికీ గృహజ్యోతి పెండింగ్ దరఖాస్తులపై స్పష్టత ఇవ్వలేదు.
దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న దరఖాస్తుదారులు తమకు వచ్చిన బిల్లులను, తమ అర్హతల కాగితాలను చేతపట్టుకొని కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు. బిల్లులతో బారులు తీరినా తామేమీ చేయలేమని, ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇస్తే తప్ప ప్రక్రియ ముందుకు కదిలే పరిస్థితి లేదని అధికారులు తెగేసి చెబుతున్నారు. అయితే వచ్చిన వారు నిరాశతో వెనక్కి వెళ్లకుండా తాము దరఖాస్తులు తీసుకుంటామని, కానీ.. సర్కారు సందేశం వస్తేనే సమస్యపై స్పందిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం ఆయా కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అర్హులు వస్తున్నారు. అన్ని వివరాలతో కూడిన అర్జీలు అందజేస్తున్నారు. అయోమయంతో వెనుదిరుగుతున్నారు. ఈ చిత్రం కూడా అందుకు సంబంధించినదే. జీరో బిల్లులు రానివారంతా మళ్లీ దరఖాస్తులు అందించాల్సిందేనని అధికారులు చెప్పడంతో అన్ని కాగితాలనూ పట్టుకొని పరుగు పరుగున వస్తున్నారు పాల్వంచ పట్టణంలోని దరఖాస్తుదారులు. ఇక్కడి మున్సిపాలిటీ కార్యాలయంలో రెండు కౌంటర్లు ఏర్పాటు చేసిన పురపాలక అధికారులు.. దరఖాస్తులు తీసుకొని ప్రజలను పంపించివేస్తున్నారు. ‘గృహజ్యోతి అంటూ ఈ కాంగ్రెసోళ్లు సరైన గుణపాఠమే చెప్పారు..’ అని నిట్టూర్చుతూ వెనుదిరుగుతున్నారు దరఖాస్తుదారులు.