చింతకాని, జూన్ 30: రైతుభరోసా అమలు కోసం సహకార సంఘాల్లో రైతుల నుంచి స్వీకరించిన సలహాలు, సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని ఖమ్మం డీఏవో విజయనిర్మల అన్నారు. మండలంలో చింతకాని, నాగులవంచ సహకార సంఘాల్లో ఆదివారం ఏర్పాటుచేసిన సహకార సంఘాల ప్రత్యేక మహాజన సభల్లో రైతుల అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఆమె మాట్లాడారు. రైతుభరోసా పథకాన్ని ఎవరెవరికి అందించాలన్న అంశంపై ప్రభుత్వం రైతులను అభిప్రాయాలను సేకరిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రైతుభరోసా పథకాన్ని ఇవ్వకపోయినా సహకార సంఘాల ద్వారా ప్రతి రైతుకూ ఎరువులు, విత్తనాలు ఉచితంగా అందించాలని కోరారు. అలాగే, ఎకరాలతో నిమిత్తం లేకుండా ప్రతి రైతుకూ రైతుభరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 10 ఎకరాలు వరకు సాగు భూమి ఉన్న రైతులకు రైతుభరోసా ఇవ్వాలని కోరారు. ఏడీఏ కే.వెంకటేశ్వరావు, ఏవో పల్లెల నాగయ్య, సొసైటీల చైర్మన్లు కొండపల్లి శేఖర్రెడ్డి, నల్లమోతు శేషగిరి, సొసైటీ సీఈవోలు యాలముడి శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాస్, ఎంపీపీ పూర్ణయ్య, వ్యవసాయ శాఖ సిబ్బంది ఉష, శ్రీకాంత్, రాము, హరికృష్ణ, రైతులు పాల్గొన్నారు.