కొత్తగూడెం సింగరేణి, జూన్ 30: సింగరేణి సంస్థను పర్యావరణ హిత సంస్థగా మార్చడమే కాకుండా అందరిలోనూ పర్యావరణ స్ఫూర్తిని పెంచేందుకు తానే స్వయంగా 18 వేలకు పైగా మొక్కలు నాటి, తెలంగాణలోని ఆరు జిల్లాలో 35 చిన్న అడవులను సృష్టించినందుకు గుర్తింపుగా సింగరేణి సీఎండీ బలరాంకు గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అనే ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేశారు. హైదరాబాద్లో శనివారం నిర్వహించిన గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ 2024 అవార్డుల ప్రదానోత్సవంలో ఆ సంస్థ ఎండీ అశుతోశ్ వర్మ, ఎన్టీపీసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నతాధికారులు సింగరేణి సీఎండీకి ఈ అవార్డును అందజేశారు. దేశంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ దిగ్గజ కంపెనీలు, అందులోని ప్రభావశీల వ్యక్తులకు ఏటా ఇటువంటి ప్రోత్సాహక అవార్డులు అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సింగరేణి సీఎండీ ఇప్పటికే స్వయంగా 18 వేలకు పైగా మొక్కలు నాటారని, సంస్థ కూడా ఆరు కోట్లకు పైగా మొక్కలు నాటి పర్యావరణానికి మేలు చేస్తున్న సంస్థల్లో అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ అధికారిగా ఉన్నతస్థాయిలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం ఒక్కరే 18 వేల మొక్కలు నాటి ఆరు జిల్లాల్లో 35 చిన్న అడవులుగా సృష్టించడం దేశంలోనే అత్యంత అరుదైన విషయమని కొనియాడారు. అనంతరం సీఎండీ బలరాం మాట్లాడుతూ.. మొక్కలు నాటడమంటే చిన్నప్పటి నుంచే తనకు ఎంతో ఇష్టమని, పర్యావరణ ఫరిరక్షణకు తనవంతుగా మొక్కలు నాటుతున్నానని అన్నారు. ‘ప్రతీ అడుగు పచ్చదదనం’ అనే నినాదంతో సింగరేణిలో మొక్కలు నాటే యజ్ఞాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. సింగరేణి వ్యాప్తంగా ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా మొక్కలు నాటుతామని అన్నారు.