అశ్వారావుపేట, జూలై 1 : అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. వ్యక్తిగత వేధింపులా.. స్టేషన్ సిబ్బంది సమన్వయ లోపమా అనే చర్చ మండలవ్యాప్తంగా ప్రజల్లో జోరుగా సాగుతున్నది. పోలీస్స్టేషన్పై వచ్చిన అవినీతి ఆరోపణలు, జిల్లా ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదులు, స్థానిక పోలీస్స్టేషన్లో సిబ్బంది సహాయ నిరాకరణ వంటి అనేక అనుమానాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకెళ్తే.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన ఎస్సై శ్రీరాముల శ్రీను 2014లో ఎస్సైగా ఎంపికయ్యారు. జిల్లాలోని పలు మండలాల్లో పనిచేసిన ఆయన మణుగూరు నుంచి ఫిబ్రవరి నెలలో అశ్వారావుపేటకు బదిలీపై వచ్చారు. స్థానిక పోలీస్స్టేషన్ పక్కనే ఉన్న క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. అయితే కొంతకాలంగా స్టేషన్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిబ్బంది, అధికారుల మధ్య సమన్యయం చేసేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. అసలు ఏమి జరిగిందో తెలియదు కానీ ఆదివారం ఉదయం 8గంటల ప్రాంతంలో పోలీస్స్టేషన్కు మఫ్టీలో వచ్చిన ఎస్సై శ్రీను కొత్త చట్టాల అమలు దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలిస్తుండగా ఆయన కారును డ్రైవర్ అక్కడకు తీసుకొచ్చాడు.
కొద్దిసేపటికే డ్రైవర్ను అక్కడ దింపి ఇప్పుడే వస్తానంటూ స్వయంగా కారు డ్రైవ్ చేసుకుని బయటకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం వరకు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆరా తీశారు. ఎస్సై వద్ద ఉన్న రెండు సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. దీంతో స్టేషన్ సిబ్బందితోపాటు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. రాత్రి సమయం అయినప్పటికీ తిరిగి రాకపోవడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఎస్సై మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానిక పోలీసులకు సుమారు రాత్రి 11గంటల సమయంలో సమాచారం అందింది. మహబూబాబాద్ ఆర్తి గార్డెన్ సమీపంలో పురుగులమందు తాగి డయల్ 108కి స్వయంగా ఎస్సై ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈక్రమంలో సెల్ఫోన్ లొకేషన్ను ట్రాప్ చేసే పనిలో ఉన్న పోలీసులు లొకేషన్ను గుర్తించి అక్కడికి చేరుకున్నారు. అపస్మారకస్థితిలో పడి ఉన్న ఎస్సై శ్రీనును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎస్సై ఆరోగ్యం కుదుటపడితేనే అసలు కారణం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే సీఐ వేధింపులు, కొందరు కానిస్టేబుళ్లతో విభేదాలు, సిబ్బంది సహాయ నిరాకరణ తదితర కారణాల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు మహబూబాబాద్ మీడియాకు ఎస్సై శ్రీను సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై శ్రీరాముల శ్రీనును అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం పరామర్శించారు. ఆసుపత్రి వైద్యులతో ఎస్సై ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకుడు జూపల్లి రమేశ్ ఉన్నారు.