సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియపై కార్మిక సంఘాలు పోరుబాట పట్టాయి. ప్రైవేట్కు కట్టబెడితే దాదాపు 40వేల మంది కార్మికుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధభేరి మోగిస్తున్నాయి. గుర్తింపు కార్మిక సంఘమైన ఏఐటీయూసీ, మరో జాతీయ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీ ఇప్పటివరకు తమ వైఖరిని తెలియజేయకపోగా, మిగతా సంఘాలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే స్పష్టమైన కార్యచరణ ప్రకటించిన టీబీజీకేఎస్, బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతుతో నేటి నుంచే పోరాడనున్నాయి. సోమవారం నుంచి గనులపై దశలవారీగా నిరసనలు తెలుపుతామని, 9న ఖనిలో మహాధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటున్నారని యూనియన్ పేర్కొంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణిపై అనేక కుట్రలు చేస్తున్నది. బొగ్గుబ్లాకులను వేలం వేసి ప్రైవేట్కు కట్టబెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో సింగరేణి కార్మిక సంఘాలు కన్నెర్ర జేస్తున్నాయి. ఒక్కసారిగా పోరుబాటలోకి వెళ్లిపోయాయి. బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే దాదాపు 40వేల మంది కార్మికుల భవిష్యత్ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచి ఉండగా, మెజారిటీ కార్మిక సంఘాలు ఆందోళనలకు సిద్ధమయ్యాయి. గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న ఏఐటీయూసీ ఇప్పటివరకు స్పష్టమైన ప్రణాళిక లేకుండా, తమ వైఖరిని తెలియజేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. మరో జాతీయ కార్మిక సంఘం కాంగ్రెస్కు అనుబంధమైన ఐఎన్టీయూసీ సైతం వేలానికి వ్యతిరేకమని చెబుతున్నప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, ఆ పార్టీ వైఖరి ఎలా ఉంటుందో తెలియకపోవడంతో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నది. ఇదిలాఉంటే రెండ్రోజుల కింద శ్రీరాంపూర్లో హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్తోపాటు ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ ఇతర సంఘాల ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించి బొగ్గు బ్లాక్ల వేలాన్ని తీవ్రంగా నిరసిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చేనెల 3న హైదరాబాద్ సోమాజిగూడలో ప్రెస్క్లబ్లో కార్మిక సంఘాల నాయకులు, మేధావులతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యచరణ నిర్ణయిస్తామని రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు.
సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని బీఆర్ఎస్ పేర్కొంటున్నది. అధికారంలో ఉన్న పదేండ్లలో సింగరేణి కార్మికుల అనేక హక్కులు కల్పించిన ఘనత బీఆర్ఎస్కే దక్కింది. ఆంధ్రా వలసవాదుల కుట్రలో తీవ్రంగా నలిగిపోయిన సంస్థను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లి కోల్ ఇండియాలో లేని అనేక హక్కులు కల్పించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కింది. బీఆర్ఎస్ హయాంలో ప్రగతి బాటలో పయనించిన సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గు బ్లాక్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేలం వేయాలనే కుట్రలను సహించేది లేదని తేల్చి చెప్పుతూ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ అనుబంధ సంఘం, సింగరేణి సంస్థలో దశాబ్ద కాలానికిపైగా గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ కార్మికుల రక్షణే ధ్యేయంగా ముందు సాగుతామని పేర్కొంటున్నది. ఈ క్రమంలో బొగ్గు బ్లాక్లకు వ్యతిరేకంగా కలిసి వచ్చే కార్మిక సంఘాలతో ముందుకు సాగుతామని ప్రకటించింది.
సింగరేణిని కాపాడుకునేందుకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాటానికి సిద్ధమైంది. సోమవారం నుంచి సింగరేణి వ్యాప్తంగా దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. 1న గనులపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడంతోపాటు గని అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని, 3న అన్ని ఏరియాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం, 6న సింగరేణిలోని అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, జీఎంలకు వినతిపత్రాలు అందజేత, 9న గోదావరిఖని పట్టణంలో మహాధర్నా ఉంటుందని, దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, సింగరేణి కార్మికులు పెద్దసంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని మిర్యాల రాజిరెడ్డి తెలిపారు.