ఖమ్మం, జూలై 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రెండ్రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని పలు రాజకీయపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. కుమారుడు మృతితో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని, రైతుకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభాకర్ తండ్రి వీరభద్రయ్య విజ్ఞప్తి చేశారు. 70ఏళ్ల వయస్సులో దివ్యాంగుడినైనా తాను కుటుంబ పోషణ కోసం ఏ పని చేయలేనని, ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రభాకర్ కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నంతలో కుటుంబాన్ని పోషించుకుంటూ పదిమందితో మంచి అనిపించుకుంటున్న సమయంలో తమ పొలాన్ని కొందరు కక్షపూరితంగా చెరువులో కలపడం అత్యంతదారుణమని, ఈ విషయంపై కలతచెందిన తన కుమారుడు ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వీరభద్రయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనలేదని, ప్రభాకర్కు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని, ప్రభాకర్ భార్య సైతం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందన్నారు. ప్రభాకర్ మరణానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై ప్రభాకర్ వీడియో ద్వారా దేశానికి చాటిచెప్పే ప్రయత్నం చేస్తే జరిగిన అన్యాయంపై కాకుండా తీసిన వీడియోపై రాద్దాంతం చేయడం తమ కుటుంబ సభ్యులను మరింతగా బాధపెట్టేలా చేస్తుందని ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రభాకర్ కుటుంబానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలని కోరాడు.
ప్రభాకర్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, తమకు గల 7.10 ఎకరాల భూమిలో 3ఎకరాలను గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు చెరువులో కలిపిన తీరును వీరభద్రయ్య వివరించారు. ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రభాకర్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని వీరభద్రయ్య విజ్ఞప్తి చేశారు. ప్రభాకర్ మరణానికి కారకులైన వారిపై తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా చర్య తీసుకోవాలని కోరారు. ప్రధాన నిందితులను తప్పించేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు ప్రచారం ఉందని, ప్రభాకర్ ఆత్మహత్యకు కారకులైన కిశోర్ వంటి నాయకులను తప్పిస్తే ప్రభాకర్ ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. తమ ఫిర్యాదు ఆధారంగానే ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. ప్రభాకర్ ఆత్మహత్య పట్ల మాజీ మంత్రి హరీశ్రావు స్పందించారని, ప్రభాకర్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా డిమాండ్ చేయడం శోకతప్తంతో ఉన్న తమ కుటంబానికి కొంత ఊరట కలిగించేదిగా ఉందన్నారు. అధికార పార్టీ నేతలు సైతం స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. రెండురోజులు గడిచినా ప్రభుత్వపరంగా ఓదార్పు లభించలేదని, బుధవారం చింతకాని తహసీల్దార్ రమేశ్ మాత్రం పలు వివరాలను అడిగి తెలుసుకున్నారని తెలిపారు. కాగా.. సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రైతు సంఘం నాయకులు మలీదు నాగేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కోలేటి నాగేశ్వరరావు, పార్టీ డివిజన్ కార్యదర్శి ఝాన్సీ, జిల్లా నాయకులు లక్ష్మణ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, మండల అధ్యక్షుడు వీరప్రసాద్, కొండా గోపి ప్రభాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రైతు ప్రభాకర్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ కొనసాగుతున్నదని, ఈ ఘటన చాలా బాధ కలిగించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభాకర్ ఆత్మహత్య వెనుక గల కారణాలు.. ఎవరు ఉన్నారనే అంశాలపై లోతైన దర్యాప్తు జరుగుతున్నదని, కారకులు ఎంతటి వారైనా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే పోలీస్, రెవెన్యూ శాఖలు ఈ ఘటనపై పూర్తిస్థాయిలో పరిశోధన చేస్తున్నాయని పేర్కొన్నారు.
చింతకాని, జూలై 3 : రైతు ప్రభాకర్ కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొండబాల కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం ప్రొద్దుటూరులో రైతు ప్రభాకర్ కుటుంబాన్ని వారు పరామర్శించారు. ఘటనపై పూర్వాపరాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని, కుటుంబ సభ్యులు, రైతులు అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. అనంతరం రైతు భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40ఏళ్లుగా పట్టాదారు పాస్ పుస్తకం ఉండి వారసత్వంగా సాగు చేసుకుంటున్న రైతు ప్రభాకర్ పొలాన్ని మత్స్య సొసైటీకి చెందిన కొందరు వ్యక్తులు జేసీబీ, పొైక్లెన్లతో ధ్వంసం చేయడం దురదృష్టకరమన్నారు. దీనిపై అధికారులను వేడుకున్నా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. దీంతో ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, నాయకులు బొడ్డు వెంకట్రామయ్య, పిన్నెల్లి శ్రీను, వేముల నర్సయ్య, పొనుగోటి రత్నాకర్ పాల్గొన్నారు.
చింతకాని తహసీల్దార్ రమేశ్ను రైతు ప్రభాకర్ కుటుంబ సభ్యులు ఘెరావ్ చేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ప్రొద్దుటూరులో ఆత్మహత్యకు పాల్పడిన రైతు ప్రభాకర్ పొలాన్ని పరిశీలించడానికి తహసీల్దార్ తన సిబ్బంది, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల బృందంతో వెళ్లారు. విషయం తెలిసిన ప్రభాకర్ కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకొని తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. న్యాయం కోసం గతంలో వినతిపత్రం ఇవ్వగా ఎందుకు స్పందించలేదంటూ తహసీల్దార్ను ప్రశ్నించారు. ప్రభాకర్ కుమారుడు వేదవ్యాస్, కుమార్తె శ్రీజ తహసీల్దార్ కాళ్లపై పడి ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, పొలం హద్దులను త్వరలో కల్పిస్తామని తెలిపారు. ఎస్సై షేక్ నాగుల్మీరా, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.