ఖమ్మం, జనవరి 2: ఖమ్మం ఖిల్లాలోని ప్రతి సమస్యకూ పరిష్కారం చూపుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. జాఫర్ బౌడీ మరమ్మతులకు నిధులు కేటాయిస్తామని, ఖబరస్తాన్ ప్రహరీకి రూ.15 లక్షలు మంజూరుచేస్తామని అన్నారు. ‘వాడవాడా పువ్వాడ’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు సోమవారం ఆయన 38వ డివిజన్ ఖిల్లాలో పర్యటించారు. ‘అచ్చా పానీ రోజ్ ఆతిహై? ఆప్కో పింఛన్ ఆతాహై? క్యా రోజ్ మున్సిపల్ ట్రాక్టర్ ఘర్కో సామ్నే ఆతే హై?’ అంటూ ఖిల్లాలో ఇంటింటికీ వెళ్లి పలుకరిస్తూ ముందుకు సాగారు. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులతో మాట్లాడగా వారు పలు సమస్యలను చెప్పారు. ‘మన ఊరు – మన బడి’కి తాను రూ.50 లక్షలు కేటాయించానని, ఆ నిధులతో ఈ సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. అక్కడ నుంచే డీఈవోతో మాట్లాడారు.
మంచినీటి పైపులైన్ వేయాలని మిషన్ భగీరథ ఈఈ రంజిత్ను ఆదేశించారు. ఓ మహిళ వచ్చి తాను మైనార్టీ రుణానికి దరఖాస్తు చేసుకున్నానని, అయినా తనకు రుణం రాలేదని చెప్పారు. అందుకు మంత్రి వెంటనే స్పందించి మైనార్టీ అధికారిని పిలిచి ప్రశ్నించారు. అక్కడి నుంచి వెళ్లి జాఫర్ బౌడీని పరిశీలించారు. దానిని క్లీన్ చేయించి లైటింగ్ ఏర్పాటు చేయాలని కేఎంసీ కమిషనర్కు సూచించారు. అక్కడి నుంచి ఖబరస్తాన్ దగ్గరకు వెళ్లగా కార్పొరేటర్ ఆలియా షౌకత్, మాజీ కార్పొరేటర్ షౌకత్ అలీలు ఖబరస్తాన్కు ప్రహరీ లేదని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే మంత్రి స్పందించి రూ.15 లక్షలను మంజూరు చేశారు. అదేవిధంగా నిమ్రా మజీద్ నుంచి ఖబరస్తాన్ రోడ్డు వరకు వీడీఎఫ్ రోడ్డును మంజూరు చేస్తున్నామన్నారు.
బాగ్ ప్రాంతంలోని పార్క్కు వెళ్తుండగా సైడ్ డ్రెయిన్ను నిర్మించి దాని పక్కన రోడ్డును శుభ్రం చేయకపోవడంపై ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బైక్పై ఖిల్లా నుంచి షాదీఖానాకు చేరుకున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఆలియా షౌకత్, షౌకత్ అలీ, ఖమర్, నజీముద్దీన్, అప్సర్, షేక్ జిలాని, ఇషాక్, పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, ఆదర్శ్ సురభి, ఫాతిమా జోహారా ముక్తార్, లక్ష్మీప్రసన్న, షకీనా, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటోందని మంత్రి అజయ్ పేర్కొన్నారు. ‘వాడవాడ పువ్వాడ’ కార్యక్రమంలో ప్రతి సమస్యనూ పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఖిల్లాలో విలేకరులతో మంత్రి మాట్లాడారు. నగర అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులను మంత్రి కేటీఆర్ కేటాయించినట్లు చెప్పారు.