ఖమ్మం, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భద్రాచలం మండలంలోని ఐదు విలీన గ్రామాలను తిరిగి తెలంగాణకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వరద ముంపునకు ఏమాత్రమూ సంబంధం లేని ఆ గ్రామాలను తిరిగి భద్రాచలం మండలంలో కలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన హామీలు, తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య పాలనాపరమైన అంశాలపై ఎప్పుడు చర్చ జరిగినా విలీన గ్రామాలను తిరిగి ఇచ్చే విషయాన్ని ప్రధాన అంశంగా చర్చిస్తామని అన్నారు. ఈ గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం కావడం వల్ల.. దినదినాభివృద్ధి చెందుతున్న భద్రాచలం పట్టణానికి డంపింగ్ యార్డు కూడా లేని పరిస్థితి ఏర్పడిందని, చెత్త ఎక్కడ పోయాలో కూడా తెలియని దుస్థితి తలెత్తిందన్నారు. ఈ విలీన గ్రామాలకు తిరిగి తెలంగాణకు కేటాయించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరద నీటిపరంగా ఎటువంటి ఇబ్బందీ ఉండదని అన్నారు. ఈ గ్రామాలు ముంపునకు సంబంధం లేని గ్రామాలుగా వివరించారు.
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి రూ.655 కోట్లు మంజూరు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణం, పలు అభివృద్ధి పనుల కోసం రూ.654.86 కోట్ల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఏడాది యాక్షన్ ప్లాన్లో భాగంగా తమ ప్రభుత్వం నుంచి ఈ నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి జిల్లాకు మంజూరైన రోడ్లు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిధులు మంజూరు చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మంజూరు చేయించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రహదారులకు సంబంధించి త్వరలోనే డీపీఆర్ పూర్తి చేస్తామని, సాంకేతిక అనుమతల మంజూరు అనంతరం టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.