ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, జూలై 2 : ‘బస్సొస్తే బడికి.. రాకుంటే ఇంటికి’ అన్నట్లుగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థుల పరిస్థితి. ‘పాఠశాలకు వెళ్లొస్తాం.. మా ఊరికి బస్సు నడపండి మహాప్రభో..’ అంటూ నెత్తీనోరూ బాదుకున్నా కనికరించని కాంగ్రెస్ ప్రభుత్వం.. కనీసం వారివైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో కొన్నిచోట్ల నిరుపేద తల్లిదండ్రులు సొంతంగానే ఆటోలు, ఇతర వాహనాలను కిరాయికి మాట్లాడుకొని తమ పిల్లలను పాఠశాలలకు, కళాశాలలకు పంపుతున్నారు. మరికొన్ని చోట్ల అయితే ఎండలు, వర్షాల్లో కూడా విద్యార్థులు కిలోమీటర్ల మేర నడిచి పాఠశాలలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇంకొన్ని పాఠశాలల్లో విద్యార్థుల అవస్థలు చూడలేక అక్కడి ఉపాధ్యాయులే వారికి ఆటోలతో రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ‘మహిళలకు ప్రయాణం ఉచితం’ పేరిట ‘మహాలక్ష్మి’ పథకాన్ని తెచ్చిన కొత్త సర్కారు.. విద్యార్థుల కోసం నడపాల్సిన సర్వీసులను తగ్గించింది. ఈ నిర్ణయం విద్యార్థుల బంగారు భవితపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. పైగా, గ్రామీణ ప్రాంతాలకు నడిపే సర్వీసులను కూడా గణనీయంగా తగ్గించింది. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో బస్సులను తిప్పుతుండడంతో.. మండల కేంద్రాలు, పట్టణాల్లోని ఉన్నత పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి వచ్చే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. ఫలితంగా వారి చదువులు కూడా అగమ్యగోచరమయ్యే పరిస్థితి కన్పిస్తోంది. భద్రాద్రి జిల్లాలో 492 గ్రామాలకు రహదారి సౌకర్యాలు ఉండగా.. 208 గ్రామాలకు బస్సు సర్వీసులు నడపకపోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతుతోంది.
పాఠశాలలు ప్రారంభమై 20 రోజులైనా పొరుగు గ్రామాల్లోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లివచ్చే విద్యార్థుల సమస్యపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టిపెట్టిన పాపానపోలేదు. ఇక విద్యార్థుల రాయితీ బస్పాస్ల సంగతి సరేసరి. ప్రధాన మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న కొన్ని పల్లెవెలుగు బస్సులు విద్యార్థినులను ఎక్కించుకోకుండానే వెళ్తున్నాయి. ఈ బాధలు భరించలేని కొంతమంది విద్యార్థులు పట్టణాల్లో ప్రైవేటు హాస్లళ్లను, అద్దె గదులను ఆశ్రయిస్తున్నారు.
పేరుకే పల్లె వెలుగు బస్సులైనా అవి కేవలం పట్టణాలకే పరిమితమవుతున్నాయి. దీంతో ఏజెన్సీ గ్రామాలు ఎక్కువగా ఉన్న భద్రాద్రి జిల్లాలో విద్యార్థులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ జిల్లాలో 492 గ్రామాలకు రహదారి సౌకర్యాలు ఉండగా.. ఇంకా 208 గ్రామాలకు బస్సులు రాకపోకలు సాగించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో మారుమూల ప్రాంతాల విద్యార్థులు కొందరు సైకిళ్ల మీద స్కూల్కు వెళ్లి వస్తున్నారు. మరికొందరు విద్యార్థులను తల్లిదండ్రులు రోజూ దింపివస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో అప్పటికే నడుస్తున్న బస్సులను కూడా ప్రస్తుత ప్రభుత్వం బంద్ పెట్టింది. కొన్ని ప్రాంతాల్లో ఈ విషయం స్పష్టంగా కన్పిస్తోంది. ఇల్లెందు మండలం సుదిమళ్ల మార్గంలో పూబెల్లి, ధర్మాపురం గ్రామాల్లో గతంలో బస్ నడిచేది. కానీ.. ఇప్పుడు ఆ సర్వీసు రద్దుచేశారు. దీంతో విద్యార్థులు ఆటోల్లో వెళ్లివస్తున్నారు. టేకులపల్లి మండలం బోడు గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే 12 పంచాయతీలను కలుపుతూ గతంలో బస్సు నడిచేది. ప్రస్తుతం ఆ బస్సునూ తీసేశారు. ములకలపల్లి మండలం చౌటుగూడెం, తిమ్మంపేట, మూకమామిడి, పొగళ్లపల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఆయా గ్రామాల విద్యార్థులు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి ఆటోల్లో వచ్చి వెళ్తున్నారు. దుమ్ముగూడెం మండలం మారాయిగూడం-ఆర్లగూడెం మార్గంలో బస్సు లేకపోవడంతో అక్కడా అదే పరిస్థితి. పెద్దకమలాపురం, కొత్తూరు, దబ్బనూతలు, అంజిపాక గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం లేకపోవడంతో చుట్టూ 12 కిలోమీటర్లలోపు ఉండే విద్యార్థులందరూ ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇక భద్రాచలం-చర్ల మార్గంలో రాకపోకలు సాగించే బస్సులు.. దుమ్ముగూడెం ఊళ్లోకి వెళ్లడం లేదు. దుమ్ముగూడెం అడ్డరోడ్డు దగ్గరే బస్సులను ఆపుతుండడంతో అక్కడ దిగిన విద్యార్థులు కిలోమీటరు దూరం నడిచి దుమ్ముగూడెంలోని కళాశాలకు వెళ్లిరావాల్సి వస్తోంది. పెనుబల్లి మండలం తాళ్లపెంట, ఉప్పెనకుంట్ల, లింగగూడెం, బయ్యన్నగూడెం; కల్లూరు మండలం బత్తునపల్లి, కప్పలబంధం, రాళ్లబంజర, యర్రబంజర గ్రామాల విద్యార్థుల కోసం ప్రతి రోజూ ఒకే బస్సు నడుస్తోంది. ఆ బస్సు సరిపోకపోవడంతో చాలా మంది విద్యార్థులకు ఆటోలే దిక్కవుతున్నాయి.
అశ్వారావుపేట రూరల్ మండలం మారుమూల గిరిజన గ్రామ విద్యార్థులది మరీ దయనీయ పరిస్థితి. అశ్వారావుపేట మండల కేంద్రానికి 20 కిల్లో మీటర్ల దూరంలో మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ ఉంది. దాని పరిధిలోని కొండతోగు గ్రామంలో సుమారు 40 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలకు చెందిన కొందరు పిల్లలు స్థానిక అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు. ప్రాథమిక పాఠశాలకు వెళ్లాలంటే వారి గ్రామానికి 2 కిల్లోమీటర్లకుపైగా దూరంలో ఉన్న పండువారిగూడేనికి వెళ్లాలి. వర్షాకాలంలో కొండతోగు, పండువారిగూడెం గ్రామాల మధ్య ఉన్న వాగును దాటాలి. ప్రమాదమైనప్పటికీ విద్యార్థులు ఆ వాగును దాటి పాఠశాలకు వెళ్లివస్తున్నారు. ప్రస్తుతం కొండతోగు గ్రామానికి చెందిన సోడెం అఖిల్ (4వ తరగతి), పూసం సాయివినయ్ (2వ), చేప రామ్తేజ్ (4వ), తుర్సం మీనాక్షి (3వ), పూసం సాయి విజ్ఞేశ్ (2వ), తుర్సం మణిత (1వ), తుర్సం సాయి జస్వంత్ (1వ తరగతి) చదువుతున్నారు. వీరిలో చాలా మంది పిల్లలు కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేని పరిస్థితుల్లో కొండతోగు నుంచి పండువారిగూడెం ప్రభుత్వ పాఠశాలకు వచ్చివెళ్తున్నారు.
నేను ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాను. కాలేజీకి వెళ్లాలంటే రోజూ కిలో మీటరు నడవాల్సి వస్తోంది. నేనే కాదు.. మా గ్రామం నుంచి కాలేజీకి వెళ్లి వచ్చే పిల్లలమందరమూ రోజూ నడిచే వెళ్తాం. నడిచే వస్తాం. దుమ్ముగూడెంచర్ల మార్గంలో నడిచే బస్సులను మా గ్రామంలో ఎక్కుతాం. అయితే బస్సులు మా కాలేజీ ఉన్న దుమ్ముగూడెంలోని వెళ్లడం లేదు. కిలోమీటరు ఇవతల ఉన్న దుమ్ముగూడెం అడ్డరోడ్దు వద్దనే ఆగుతున్నాయి. దీంతో మీమంతా అక్కడ దిగి దుమ్ముగూడెంలోని కళాశాలకు నడిచి వెళ్తున్నాం.
మాది ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామం. నేను బూర్గంపహాడ్లోని స్కూలుకు వెళ్లివస్తుంటాను. మా ఊరికి బస్సు సౌకర్యం లేదు. ఎక్కువమంది స్కూలు పిల్లలు లేరు అనే కారణంతో ఆర్టీసీ అధికారులు మా గ్రామానికి బస్సును నడపడం లేదు. దీంతో మా తల్లిదండ్రులు ప్రైవేటుగా ఆటో మాట్లాడారు. మేమే సొంతంగా కిరాయిలు భరించుకుంటూ ఆటోలో స్కూలుకు వెళ్లివస్తున్నాం. బస్సులేని కారణంగా ఆటోలో వెళ్లి రావడం కష్టంగా అనిపిస్తోంది. కానీ తప్పడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా మా గ్రామానికి బస్సు నడపాలి.
నా కుమారుడు 4వ తరగతి చదువుతున్నాడు. చదువు కోసం ప్రతీ రోజూ ఇల్లెందుకు ప్రయాణించాల్సి వస్తోంది. బస్సు లేకపోవడంతో అందుబాటులో ఏ వాహనం ఉంటే ఆ వాహనాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది. మా ఊరికి గతంలో బస్సు నడిచేది. ఇప్పుడు దానిని తీసేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సులే పెట్టి.. విద్యార్థులకు అన్యాయం చేసింది. బడి పిల్లల కోసం బస్సులు నడపాలి.
నా పేరు ప్రణవి, ఐదో తరగతి చదువుతున్నాను. మాది తిమ్మంపేట గ్రామం. మా ఊరికి బస్సు రాదు. దీంతో నేను ఒకటో తరగతి నుంచి ఇప్పటి వరకూ ఆటోలోనే ములకలపల్లికి వస్తూ చదువుకుంటున్నాను. నాతోపాటు మా గ్రామంలోని చాలా మంది పిల్లలు నాతోపాటే ఆటోల్లో వస్తున్నారు. మా ఊరికి బస్సును నడిపిస్తే బాగుంటుంది.
మాది అంజిపాక గ్రామం. నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. పెదకమలాపురం, దుబ్బనూతల గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. దీంతో అక్కడి నుంచి 15 కిలోమీటర్ల వరకు ప్రైవేటు వాహనాలపై వస్తున్నాను. ఒక్కోసారి ఏదైనా బైకును లిఫ్ట్ అడిగి రావాల్సి వస్తోంది. మావన్నీ పల్లెటూళ్లే. బస్సులు సరిగా రావడం లేదు. ప్రభుత్వ కాలేజీలో చదువుకునే వారికోసమైనా బస్సులు నడపాలి.
వైరా మండలంలో విద్యార్థుల కోసం స్వయంగా పాఠశాల హెచ్ఎం, టీచర్లే సొంతంగా ఆటోను ఏర్పాటుచేశారు. ఆ మండలంలోని లింగన్నపాలెం, విప్పలమడక గ్రామాలకు చెందిన 18 మంది విద్యార్థులు సమీపంలోని గరికపాడు పాఠశాలకు ప్రతి రోజూ వెళ్లివస్తుంటారు. అయితే తరచూ ఆ బస్సు ఆలస్యమవుతుండడంతో విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకోవడం లేదు. తరగతులను కోల్పోతున్నారు. దీంతో పాఠశాల హెచ్ఎం, టీచర్లు స్పందించి సదరు విద్యార్థుల కోసం వారే స్వచ్ఛందంగా ఓ ఆటోను ఏర్పాటు చేశారు.
వైరా నుంచి ఉదయం 8 గంటలకు బయల్దేరాల్సిన బస్సు 8:40 గంటలకు బయలుదేరుతోంది. దీంతో విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకోలేకపోతున్నారు. 8:40కి వైరాలో బయలుదేరితే స్టేజీ పినపాక, సిరిపురం, నారపునేనిపల్లి, విప్పలమడక, లింగపాలెం మీదుగా గరికపాడు చేరుకునే సరికి పాఠశాల సమయం దాటిపోతోంది. ఈ ఇబ్బందులు పడలేని కొందరు తల్లిదండ్రులు.. ఆర్థిక భారమైనప్పటికీ ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు.