జిల్లాలో ఆర్టీసీ గాడిన పడింది. గతంలో నష్టాల్లో ఉన్న డిపోలు ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఈ ఏడాది జిల్లా లోని మూడు డిపోలైన కొత్తగూడెం, మణు గూరు, భద్రాచలంలో నష్టాలు పూర్తిగా తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా 96 డిపోల్లో 45 డిపోలు లాభాలు ఆర్జించగా అందులో జిల్లా లోని మూడు డిపోలు చేరడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగూడెం అర్బన్, మే 12 : గతేడాది నుంచి ఆర్టీసీ క్రమక్రమంగా నష్టాలను తగ్గించుకుంటూ వస్తోంది. ప్రస్తుత సంవత్సరం మెరుగైన స్థానంలో నిలిచింది. 2022లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలు పరిశీలిస్తే ఈ నాలుగు నెలల కాలానికి కొత్తగూడెం ఆర్టీసీ డిపో రూ.14.62 కోట్ల రోజువారీ ఎర్నింగ్స్ను సాధిస్తే ఈ ఏడాది 2023లో మెదటి నాలుగు నెలల కాలానికి రూ.16.13 కోట్లు సాధించింది. మణుగూరు డిపోను పరిశీలిస్తే గతేడాది నాలుగు నెలల కాలానికి రూ.14.06 కోట్లు సాధిస్తే ఈ ఏడాది రూ.16.76 కోట్లు, భద్రాచలం డిపోను పరిశీలిస్తే గతేడాది నాలుగు నెలలకు రూ.21.29 కోట్లు సాధిస్తే, ప్రస్తుతానికి రూ.25 కోట్లు సాధించింది. ఫలితంగా ప్రతి నెలా ఎర్నింగ్స్ పెరుగుతూ ఆర్టీసీ ఆర్థిక పరిపుష్టి సాధించే దిశగా అడుగిడుతోంది. ప్రతి రోజు ఆదాయం చూసుకున్నట్లయితే కొత్తగూడెం సుమారు రూ.12 లక్షలు, మణుగూరు డిపో రూ.16 లక్షలు, భద్రాచలం డిపో రూ.17 లక్షలకు పైగానే వస్తున్నాయి.
గతంలో ఎప్పుడూ మూడు డిపోలు లాభాల్లో ఉన్న సందర్భాలు లేవని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం లేదా మణుగూరు ఏదో ఒక డిపో మాత్రమే నష్టాలను అధిగమిస్తూ లాభాల్లో ఉండేది. కొత్తగూడెం డిపో దాదాపు రూ.1.50 కోట్ల నష్టాన్ని అధిగమించి ప్రస్తుతం లాభాల బాటలో పడింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మూడు డిపోలు లాభాల బాట పట్టాయి. మే నెలలో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉన్నందున ఆర్టీసీ మ్యారేజ్ స్పెషల్ బస్సులను తిప్పుతోంది. ఇప్పటికైతే ఆశించిన స్థాయిలోనే పెళ్లిళ్ల కోసం బస్సులను బుక్ చేసుకుంటున్నారు.
ఆర్టీసీపై ప్రయాణికులకు నమ్మకం ఉండడం వల్లనే లాభాలు సాధ్యమవుతున్నాయి. గతంలో నష్టాల్లో ఉన్న డిపో ప్రస్తుతం రోజువారీగా చూస్తే ఆశాజనకంగా ఉంది. నష్టాలను అధిగమించి ఇప్పుడిప్పుడే లాభాల బాటలో పడుతున్నాం. వీటిని కొనసాగించాలంటే ప్రయాణికులు మరింత ఆదరించాలి. ప్రయాణికులే ఆర్టీసీ సంస్థకు ఆస్తి. ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ చార్జిలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ సిబ్బంది పని చేస్తున్నారు.
– బాణాల వెంకటేశ్వరరావు, కొత్తగూడెం డిపో మేనేజర్