అశ్వారావుపేట, జూన్ 29 : అధికార కాంగ్రెస్ పార్టీకి కొందరు అధికారులు స్వామిభక్తి చాటుకుంటున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి చిహ్నాలను తొలగించే యత్నం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని, చిహ్నాలు తొలగించినంత మాత్రాన ఏమీకాదని హితవు పలుకుతున్నారు. టీఎస్ ఆయిల్ఫెడ్ సంస్థలో చోటుచేసుకున్న అక్రమ బాగోతం వివరాలు ఇలా ఉన్నాయి.
టీఎస్ ఆయిల్ఫెడ్ సంస్థ ఉన్నతాధికారుల విడిది కోసం రూ.2.5 కోట్లతో అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామంలో గెస్ట్హౌస్ నిర్మించింది. పనులు పూర్తయిన తర్వాత అప్పటి సంస్థ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, అప్పటి స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ రావు జోగేశ్వరరావు, జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మితో కలిసి గత ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన అట్టహాసంగా ప్రారంభించారు. ఆయిల్ఫెడ్ సంస్థతోపాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు విశ్రాంతి తీసుకోవడానికి ఈ గెస్ట్హౌస్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. కానీ.. అధికారులకు ఏమైందో.. లేదా అధికార పార్టీ నేతల సూచనలతోనో గానీ గెస్ట్హౌస్ శిలాఫలకాన్ని గుట్టుచప్పుడు కాకుండా తొలగించేశారు.
అంతా బాగానే చేశారు గానీ.. ఆ ప్రదేశంలో పూలదండలు కట్టేందుకు ఏర్పాటు చేసిన మేకులను మాత్రం తీయలేకపోయారు. శిలాఫలకం తీసిన తర్వాత ఆనవాళ్ళు కనిపించకుండా మేకులు తీయకుండానే సున్నంతో కప్పేశారు. శుక్రవారం మంత్రి తుమ్మల, ఆయిల్ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా పర్యటన సందర్భంగా గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన భోజనాలకు వచ్చిన కొందరు రైతులు ఈ విషయాన్ని గమనించారు. ఇదేక్కడి విడ్డూరం అంటూ ముక్కున వేలేసుకున్నారు. శిలాఫలకం తీసేసినంత మాత్రాన గెస్ట్హౌస్ను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినట్లు కాదు కదా.. అంటూ గుసగుసలాడుకున్నారు. సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ క్యాడర్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం నియోజకవర్గవ్యాప్తంగా వ్యాపించింది. కాంగ్రెస్ పార్టీపై ఎంతగా అభిమానం ఉంటే మాత్రం ఏకంగా గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన అనవాళ్ళను తొలిగిస్తారా… అంటూ రైతులు మండిపడుతున్నారు.
అధికారులపై చర్య తీసుకోవాలి
కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఆనవాళ్లను కొందరు అధికారులు తొలగించే ప్రయత్నం చేయడం సరికాదు. అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల స్వామిభక్తి చాటుకోవడానికి గత కేసీఆర్ ప్రభుత్వ గుర్తులను తొలగించాలనుకోవడం సైకో చేష్టలకు నిదర్శనం. శిలాఫలకం తొలగించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. శిలాఫలకాన్ని యథాస్థానంలో ఏర్పాటు చేయాలి.
– జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, ఎంపీపీ, అశ్వారావుపేట