భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ఖమ్మం వ్యవసాయం, జూన్ 30: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం ప్రారంభమైన వాన ఆదివారం రాత్రి దాటినా ధార తెగకుండా కురుస్తూనే ఉంది. కొన్ని మండలాల్లో తేలికపాటి, మరికొన్ని మండలాల్లో మోస్తరు, ఇంకొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురిసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సగటున 32 మిల్లీ మీటర్ల వర్షపాతం, భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెంలో 39 డిగ్రీల వర్షపాతం నమోదైంది. ఈ వర్షంతో పత్తి, పునాస పంటలు ప్రాణం పోసుకుంటున్నాయి. విరామం లేకుండా కురిసిన వానతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లో జనజీవనానికి కాస్త ఆటంకం ఏర్పడింది. ఆయా పనుల మీద బయటకు వెళ్లాల్సిన వారు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఖమ్మం జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన సరాసరి వర్షపాతం 32 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఇందులో అత్యధికంగా తిరుమలయపాలెంలో 72.2 మిల్లీమీటర్లుగా ఉంది. ఆ తరువాత కూసుమంచిలో 43.8, ఖమ్మం రూరల్లో 46.2, ఖమ్మం అర్బన్లో 36.6, చింతకానిలో 35.6, నేలకొండపల్లిలో 39.8, రఘునాథపాలెంలో 34.8, కొణిజర్లలో 30, బోనకల్లులో 39.2, వైరాలో 34.4, వేంసూరులో 51.8, ఎర్రుపాలెంలో 32 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
ప్రస్తుత వానముసురు వల్ల వానకాలం సీజన్లో సాగు చేసిన పత్తి, పునాస పంటలు ప్రాణం పోసుకుంటున్నాయి. ఇటీవలి వరకూ సరైన మోతాదులో వర్షాలు కురవకపోవడం వల్ల భూమిలో తేమ, నిమ్ముశాతం తగ్గిపోయాయి. పంటల కాపాడుకునేందుకు అన్నదాతలు నిన్నామొన్నటి అనేకపాట్లు పడ్డారు. తాజాగా కురుస్తున్న వర్షాల వల్ల పంటలు జీవం పోసుకుంటున్నాయి. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది దాదాపు 5,96,662 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కావొచ్చని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ 1,82 723 ఎకరాల్లో పంటలు మొలకెత్తాయని, అందులో అత్యధికంగా 1,35 658 ఎకరాల్లో పత్తి, 13,713 ఎకరాల్లో వరి, 7,611 ఎకరాల్లో పెసర, 752 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగవుతున్నాయి. 25 వేల ఎకరాల్లో రైతులు పచ్చిరొట్ట విత్తనాలను చల్లారు.
భద్రాద్రి జిల్లాలో కూడా వర్షం కురుస్తూనే ఉంది. అశ్వాపురం, పాల్వంచ, గుండాల, దుమ్ముగూడెం, ఆళ్లపల్లి మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. మొర్రేడు, తాలిపేరు, పెదవాగు, సింగభూపాలెం, కిన్నెరసాని, చెరువులు, డ్యాములు, వాగులకు వరద తాకిడి పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
వైరా రూరల్, జూన్ 30: వర్షం కారణంగా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో ఆదివారం ఉదయం భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కూలింది. దీంతో వైరా జగ్గయ్యపేట మార్గంలో కిలోమీటర్ల వందలాది వాహనాలు నిలిచిపోయాయి.
రామవరం, జూన్ 30: శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓసీల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 38 వేల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉండగా వర్షం కారణంగా ఉత్పత్తి పూర్తిగా నిలిచిందిపోయింది. 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.