భద్రాచలం, జూన్ 28 : ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు నాణ్యమైన నిత్యావసర సరుకులు, సీజన్లవారీగా పండ్లు సరఫరా చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, గురుకుల ఆర్సీవో వెంకటేశ్వరరాజు, జీసీసీ డీఎం దావీదు, జిల్లా పర్చేజ్ కమిటీ సభ్యులు, ఏజెన్సీల యజమానుల సమక్షంలో నిర్వహించిన టెండర్ ప్రక్రియలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖమ్మం జిల్లాలోని 19 గురుకుల పాఠశాలల్లో, 8 ఈఎంఆర్ఎస్ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు టెండర్ ప్రక్రియ నిర్వహించామని తెలిపారు. కోడిగుడ్లు, అరటి పండ్లతోపాటు సీజనల్గా లభించే పండ్లు, కూరగాయలు, స్కిన్ లెస్ చికెన్ నాణ్యతతో కూడినది సరఫరా చేసేందుకు 114 మంది ఏజెన్సీదారులు టెండర్లు దాఖలు చేస్తే..
అందరికంటే తక్కువ కోట్ చేసిన వారికి వస్తువుల సరఫరా బాధ్యతను అప్పగించామన్నారు. ఏజెన్సీదారులు సరఫరా చేస్తున్న సరుకులు వచ్చిన ప్రతిసారి వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఏమా త్రం నాసిరకంగా ఉన్నా తనకు తెలపాలన్నారు. అన్ని పాఠశాలలను తనిఖీ చేస్తానని, ఆ సమయంలో నాసిరకం వస్తువులు సరఫరా అయినట్లు తన దృష్టికి వస్తే ఏజెన్సీదారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో గురుకుల పర్యవేక్షకులు కృష్ణార్జున, ఏవో నరేందర్, మహిళా డిగ్రీ కళాశాల ఏవో ప్రమీల, గురుకులం, ఈఎంఆర్ఎస్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, గురుకుల సిబ్బంది వరలక్ష్మి, చంటి, గణేశ్, శ్రీనివాస్, లిఖిత్, ఏజెన్సీదారులు పాల్గొన్నారు.