రామవరం, జూలై 1 : బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొత్తగూడెం ఏరియాలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మైన్స్, ఓసీలు, డిపార్ట్మెంట్లోని కార్మికులు సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణికి మాత్రమే కేటాయించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీనిపై స్పందించాలని టీబీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం హెచ్వోడీలకు మెమోరాండం అందించారు. చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసన వీరభద్రం, ఏరియా ఉపాధ్యక్షుడు గడప రాజయ్య, సెంట్రల్ కమిటీ మెంబర్లు కాగితపు విజయ్కుమార్, బూర్గుల రవికుమార్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, పూర్ణచందర్, చంద్రశేఖర్, వెంకట్రావ్, ఎన్వీ రావు, గణేష్, అశోక్, సీతారామ, నరేందర్, రాజ్కుమార్, సత్యనారాయణ, రమేశ్, సూరిబాబు, నాగరాజు, కార్మికులు పాల్గొన్నారు.
ఇల్లెందు రూరల్, జూలై 1 : కేంద్ర ప్రభుత్వం వేలంపాట నిర్వహించకుండా తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు మహ్మద్ జాఫర్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన సింగరేణి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థగా లక్షలాది మంది ప్రజలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తోందన్నారు. ఎందరికో ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉపాధి చూపుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. అయితే కొత్త బొగ్గు బ్లాకులను కేటాయించకపోవడం, ఉన్న బ్లాకులలో బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో సంస్థలో పనిచేస్తున్న 41 వేల మంది కార్మికుల భవిష్యత్ ఆందోళనకరంగా మారిందన్నారు. శ్రావణపల్లి ఓసీతోపాటు కల్యాణఖని బొగ్గు బ్లాకును సింగరేణి సంస్థలకే కేటాయించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.