చండ్రుగొండ, జూలై 2 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ అటవీశాఖ రేంజ్ కార్యాలయం ఎదుట మద్దుకూరు పోడుదారులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకెళ్తే.. మద్దుకూరు గ్రామానికి చెందిన 20మంది పోడుదారులు సుమారు రెండేండ్ల క్రితం 20 ఎకరాల అటవీశాఖ భూమిని సాగు కోసం పోడు కొట్టారు. దీంతో అధికారులు స్పందించి ఆ భూమిని ప్లాంటేషన్ మొక్కలు వేస్తామని చెప్పి వారివద్ద నుంచి లాక్కున్నారు. అయితే ఈ ఏడాది ఆ భూమిలో పోడు పట్టాలు కలిగిన అదే గ్రామానికి చెందిన కొందరు సాగు చేసుకుంటున్నారు. దీంతో పోడుదారులు అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి వచ్చి అక్కడే ఉన్న బీట్ అధికారి భాస్కర్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్లాంటేషన్ కోసమని తమ దగ్గరనుంచి లాక్కున్న భూమిని వారికి అప్పనంగా, అడ్డదారిలో ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.