రఘునాథపాలెం, జూలై 1 : రవాణా శాఖ అధికారుల తప్పిదం.. వాహనదారులకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ‘వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం.. కార్డు ఇవ్వండి సారూ..’ అంటూ వాహనదారులు నెత్తీ నోరూ బాదుకున్నా ఒక్క అధికారి నుంచి కూడా సరైన సమాధానం రావడం లేదు. ఈ దృశ్యాలు ఖమ్మంలోని రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయంలో ఇటీవల నిత్యకృత్యంగా కన్పిస్తున్నాయి. రవాణా శాఖ నిబంధనల ప్రకారం కార్యాలయంలో సేవలను పొందిన వాహనదారుడికి 24 గంటల్లోనే సంబంధిత పత్రాలను అప్పగించాలి. కార్యాలయ బయట ఏర్పాటు చేసిన సిటిజన్ చార్టర్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ.. క్షేత్రస్థాయిలో అది అమలుకావడం లేదు. ఖమ్మం రవాణా శాఖ ద్వారా వాహన రిజిస్ట్రేషన్లు, రెన్యూవళ్లు వంటి వివిధ రకాల సేవలు పొందిన వాహనదారులకు 47 రోజులుగా ఆర్సీ కార్డులకు దిక్కులేకుండా పోయింది. దీంతో తాము తమ వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ పోలీసులు ఎక్కడ పట్టుకొని ఫైన్ రాస్తారో అనే భయంలో రోడ్డెక్కలేని పరిస్థితి వాహనదారుల్లో నెలకొంది. అయితే, కార్డుల ప్రింటింగ్, జారీ నిలిచిపోవడానికి తమ ప్రధాన కార్యాలయం నుంచి స్టేషనరీ రాకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలోనే ప్రతి వాహనదారుడూ తాను పొందే సేవలకు అవసరమైన పత్రాల కోసం స్టేషనరీ రూపంలో రుసుము చెల్లిస్తుంటాడు. అయితే, ‘ఇంత కచ్చితంగా రుసుము తీసుకుంటున్న రవాణా శాఖ అధికారులు.. స్టేషనరీ అయిపోయిందని సాకులు చెప్పడం విడ్డూరంగా ఉంది.’ అంటున్నారు అక్కడికొచ్చిన వాహనదారులు. వెహికిల్ న్యూ రిజిస్ట్రేషన్, నాన్ ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి సేవలకు రవాణా శాఖ నుంచి కార్డులను జారీ చేస్తారు. అయితే 47 రోజులుగా కార్యాలయంలో జరుగుతున్న ఈ సేవలకు కార్డుల జారీయే లేకుండా పోయింది. సేవలు పొందిన వాహనదారులు నిత్యం కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ.. వారి చేతికి కార్డు చేరని పరిస్థితి. వాహనం ఉన్నప్పటికీ కార్డులు చేతిలో లేని కారణంగా వాహనదారుడు తన వాహనాన్ని రోడ్డుపై నడపలేని దుస్థితి. అయితే, పొరపాటున వాహనాన్ని రోడ్డు మీదకు తెచ్చినా పోలీసులు తనిఖీ చేసి జరిమానా విధిస్తే తమ పరిస్థితి ఏంటంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి స్టేషనరీ రాకపోవడంతో ఆర్సీ కార్డులు మే 15వ తేదీ నుంచి ప్రింట్ తీయడం లేదు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహనదారులు కార్డుల కోసం కార్యాలయానికి నిత్యం వచ్చిపోతున్నారు. సుమారు 4 వేల వరకు పెండింగ్ ఉన్నాయి. కార్డులు రాగానే ప్రింట్ తీసి పంపిణీ చేస్తాం.
నేను వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకొని నెల రోజులు దాటింది. కార్డు పోస్టులో ఇంటికి వస్తుందేమోనని ఎదురుచూశా. పలుమార్లు పోస్టుమాన్ను కలిసి అడిగినా రాలేదని చెప్పాడు. ఏం చేయాలో తెలియక జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి వచ్చి అధికారులను అడిగితే కార్డులు లేవంటున్నారు.
ఆర్సీ కార్డు కోసం 47 రోజులుగా వేచి చూస్తున్నా. కార్డు రాకపోవడంతో వాహనం బయటకు తీయాలంటేనే భయమేస్తోంది. కార్యాలయానికి వస్తే.. స్టేషనరీ లేకపోవడంతో ప్రింట్ తీయట్లేదని చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆర్సీ కార్డులు ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలి.