కొత్తగూడెం క్రైం/భద్రాచలం, జూలై 1 : రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా భద్రాచలం ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న పరితోష్ పంకజ్ను కొత్తగూడెం ఓఎస్డీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జనగామ జిల్లా ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న అంకిత్కుమార్ సంఖ్వార్ను భద్రాచలం ఏఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ప్రస్తుతం కొత్తగూడెం అదనపు ఎస్పీ(ఆపరేషన్స్)గా విధులు నిర్వర్తిస్తున్న టి.సాయిమనోహర్ బదిలీకి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. భద్రాచలం ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న పరితోష్ పంకజ్.. ఛత్తీస్గఢ్ సరిహద్దు ఆనుకొని ఉన్న భద్రాచలం సబ్ డివిజన్ పరిధిలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై పూర్తిస్థాయిలో అవగాహనతోపాటు అతి తక్కువ కాలంలో ఆయా గ్రామాల్లో మంచిపేరు గడించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయనకు కొత్తగూడెం ఓఎస్డీ(ఆపరేషన్స్)గా బాధ్యతలు అప్పగించింది. అలాగే జనగామ ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న అంకిత్కుమార్ సంఖ్వార్కు భద్రాచలం ఏఎస్పీగా బాధ్యతలు అప్పగించింది. కాగా.. వీరిద్దరూ ఐపీఎస్ 2020 బ్యాచ్కు చెందిన వారు కావడం విశేషం.